Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో నివర్‌ తుపాన్‌ బీభత్సం.. భారీ వర్షాలు, నిండుతున్న చెరువులు..

నివర్‌ తుపాన్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్షాలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Nivar Cyclone : Heavy Rainfall In Andhra Pradesh - bsb
Author
Hyderabad, First Published Nov 26, 2020, 11:42 AM IST

నివర్‌ తుపాన్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్షాలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో నివర్ తుఫాన్ ఎఫెక్ట్‌తో మచిలీపట్నంలో తెల్లవారుజాము నుంచి తిరువూరు, గంపలగూడెం, ఏ-కొండూరు, విస్సన్నపేట మండలాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతాంగాన్ని రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో నివర్ తపాను ప్రభావంతో  లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. ఎర్ర మిట్ట, జీవకోన, లీల మహల్ సర్కిల్‌, సత్యనారాయణపురం, కొర్ల గుంట, వినాయక సాగర్‌లో పలు గృహాలు నీట మునిగాయి. లీలా మహల్, కరకంబాడి ప్రధాన మార్గంలో నాలుగు అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో సిబ్బంది వర్షపు నీరు ప్రవహిస్తున్న కాలువల్లో జేసిబి సహాయంతో పూడికలు తీస్తున్నారు. 

తిరుమలలో మెదటి ఘాట్ రోడ్డులో 56వ మలుపు వద్ద భారీ వృక్షం కూలిపోయింది. దీంతో టీటీడీ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం తొలిగిస్తున్నారు. భక్తులకు అధికారులకు సమాచారం అందించారు. ఇక వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల్లో గత 12 గంటలుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రెండు మండలాల్లోని చెరువుల్లోకి వర్షపు నీరు భారీగా చేరుకుంటోంది. ఇప్పటికే పలు చెరువుల్లో 80 శాతం పైగా వర్షపు నీరు చేరింది. 

పదిహేనేళ్లలో ఒంటిమిట్ట చెరువు పూర్తిగా నిండడం ఇదే మొదటిసారి. దీంతో చెరువు కిందున్న 1100 ఎకరాల ఆయకట్టు భూమి సాగులోకి రానుంది. ఇక పుల్లంపేట మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పుల్లంగేరు ఉదృతంగా ప్రవహిస్తోంది. పుల్లంగేరు ప్రవహిస్తుండటంతో రాజంపేట మండలం పోలిచేరువు కింద ఉన్న ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

నివర్ తుఫాన్ తీరం దాటడంతో నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు నగరంలో తెల్లవారుజామున నుండే కరెంట్ బంద్ అయింది. మరో పక్క రహదారులపై చెట్లు కూలి పడటంతో ప్రభుత్వ సిబ్బంది వాటిని తొలగింస్తున్నారు. పంటకాలువలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.  కాళంగి నదిలోకి భారీగా వరద నీరు చేరుకుంది. చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి.

నాయుడుపేటలో నివర్ తుఫాన్ ప్రభావంతో రాత్రి కురిసిన వర్షానికి ఎగువ ప్రాంతాల నుండి స్వర్ణముఖి నదికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. కండలేరు జలాశయంలో గురువారం ఉదయానికి 60.324 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సోమశిల నుంచి 45 వేల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. జిల్లాలో పరిస్థితిపై మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులతో సమీక్షిస్తున్నారు.

నివర్ తుపాను దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 7 రైళ్లు నిలిపివేసినట్లు తెలిపింది. మరో 8 సర్వీసులను దారి మళ్లించింది. హైదరాబాద్-తాంబరం, మధురై-బికనూరు, చెన్నై సెంట్రల్-సంత్రగచి మధ్య రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. చెన్నై, తిరుపతి, రేణిగుంట, పాకాల వైపు నడిచే మరిన్ని రైలు సర్వీసులకు అంతరాయం కలగవచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

కర్నూలు, ప్రకాశం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ నివర్ తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచి తీవ్ర చలి గాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లా అంతటా చెదురు మదురు వర్షాలతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. రాగల 48గంటలు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారలు హెచ్చరికలు జారీ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios