షాక్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు దొరకని గవర్నర్ అపాయింట్ మెంట్
ఏపీ ఎస్ఈసీనిమ్మగడ్డ రమేష్ కుమార్ కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ షాక్ ఇచ్చారు. రోజంతా నిరీక్షించినప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుామర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆయనకు గవర్నర్ అపాయింట్ మెంట్ దొరకలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం బుధవారం, అంటే ఈ నెల 31వ తేదీన ముగుస్తోంది.
ఆ నేపథ్యంలో రమేష్ కుమార్ మంగళవారంనాడు గవర్నర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరుతూ నాలుగు రోజుల క్రితం రాజ్ భవన్ కార్యాలయ అధికారులను సమాచారం ఇచ్చారు. అయితే, గవర్నర్ ఆయనను కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. మంగళవారమంతా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమిషన్ కార్యాలయంలో గవర్నర్ కార్యాలయం నుంచి పిలువు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు.
గవర్నర్ కార్యాలయం నుంచి పిలుపు రాకపోవడంతో రమేష్ కుమార్ తీవ్ర నిరాశకు గురైనట్లు చెబుతున్నారు. మార్చి 19వ తేదీన తనను అత్యవసరంగా కలవాలనని ఒక రోజు ముందుగానే గవర్నర్ సమాచారం ఇ్చచినప్పటికీ తాను హైదరాబాదులో ఉన్నానంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జవాబిచ్చారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా పూర్తి చేసే అంశంపై చర్చించేందుకు గవర్నర్ అత్యవసరంగా 19వ తేదీన తనను కలవాలని ఎస్ఈసీని ఆదేశించారు. తన హయాంలో ఆ ఎన్నికలు నిర్వహించేందుకు ఇష్టపడని రమేష్ కుమార్ గవర్నర్ ను కలుసుకోలేదు. అందుకు కారణాలు ఏవో చూపించారు.
కాగా, రమేష్ కుమార్ స్థానంలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఏపీఎస్ఈసీగా నియమితులయ్యారు. ఆమె ఈ రోజు పదవీబాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.