పెళ్లయిన 20రోజులకే... నవ వధువు బలవన్మరణం... కారణమదేనా?
పెళ్ళయి ఇంకా 20రోజులు కూడా గడవకముందే నవ వధువు బలవన్మరణానికి పాల్పడటంతో పుట్టింట్లోనే కాదు అత్తవారింట్లోనూ విషాదం నెలకొంది.
కర్నూల్: పెళ్లయి 20రోజులు కూడా గడవకముందే నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. అత్తవారింటి నుండి పుట్టింటికి వచ్చిన యువతి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో పుట్టింట్లోనే కాదు అత్తవారింట్లోనూ విషాదం నెలకొంది.
కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు సమీపంలోని పార్లపల్లి గ్రామానికి చెందిన మాదన్న, నయోమి దంపతుల కూతురు అనురాధ గ్రామ వాలంటీర్ గా పనిచేస్తోంది. ఈమెకు ఇటీవలే బంధువుల అబ్బాయ కిరణ్ తో వివాహమయ్యింది. అయితే పెళ్లయిన కొద్దిరోజులకు వాలంటీర్ గా విధులు నిర్వహించడానికి పుట్టింటికి వచ్చింది అనురాధ. కొద్దిరోజులుగా అక్కడే వుంటోంది.
read more మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం... గర్భం దాల్చిన చిన్నారి
అయితే ఏమయ్యిందో తెలీదు గానీ అనురాధ నిన్న(ఆదివారం) దారుణానికి పాల్పడింది. తల్లిదండ్రులు ప్రార్థన చేసుకోడానికి చర్చికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా వున్న అనురాధ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా మారింది.
అయితే తమ కూతురు కడుపు నొప్పితో బాధపడుతూ విలవిల్లాడిపోయేదని... అది నయం కాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుని వుంటుందని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ ఆత్మహత్యా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.