భర్తకు మజ్జిగలో నవ వధువు విషం: ట్విస్ట్ ఇదీ...
పెళ్లైన వారానికి భర్తను హత్య చేసేందుకు ప్రయత్నాలు చేసిందనే ఆరోపణల నేపథ్యంలో లింగమయ్యపై వధువు కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.
కర్నూల్: పెళ్లైన వారం రోజులకే నవ వధువు మజ్జిగలో విషం కలిపి తనను హత్య చేసేందుకు ప్రయత్నాలు చేసిందని నవ వధువు ప్రయత్నాలు చేసిందని నవ వరుడు ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వివాహ బంధం నుండే బయటపడేందుకు కొత్త నాటకం ఆడుతున్నారనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.
పెళ్లి జరిగిన వారానికే భర్తను చంపేందుకు యువతి మజ్జిగలో విషం కలిపిందన్న వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. పెళ్లి ఇష్టం లేనందువల్ల మజ్జిగలో విషం కలిపి భర్తను హత్య చెయ్యాలని చూసిందంటూ వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగింది.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు ఈ నెల 11న మద్దికెర మండలం మందనంతపురానికి చెందిన నాగమణితో వివాహమైంది. వారం రోజుల తర్వాత భార్యతో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లాడు లింగమయ్య.
అదే రోజు సాయంత్రం తన భార్య మజ్జిగలో విషం కలిపి ఇచ్చిందంటూ లింగమయ్య అనంతపురం ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయం బయటికి పొక్కడంతో మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది. పెళ్లి ఇష్టం లేనందువల్ల భార్య తనకు పురుగుల మందు కలిపిన మజ్జిగ ఇచ్చిందంటూ ఆ మజ్జిగ గ్లాసును కూడా అతను అందరికీ చూపించాడు.
దీంతో అంతా నిజమేనని భావించారు. అయితే, కొత్తపెళ్లికూతురు నాగమణి కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. భర్తకు ఇచ్చిన మజ్జిగను ముందుగా తాను తాగిందని వధువు కుటుంబసభ్యులు చెప్పారు. పురుగుల మందు కలిపి ఉంటే ఎలా తాగుతుందంటున్నారు. ఆమెకు భర్తను చంపాల్సిన ఉద్దేశం ఎంతమాత్రమూ లేదంటున్నారు.
పెళ్లైనప్పటి నుంచి ముభావంగా ఉంటున్న లింగమయ్య భార్యతో కాపురం చెయ్యలేక ఈ నాటకం మొదలు పెట్టాడంటున్నారు. లింగమయ్య తాగిన పురుగుల మందు ఎక్కడ కొన్నారో తామే పోలీసులకు చెప్తామని ధీమాగా చెబుతున్నారు.
తమ బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన లింగమయ్యను వదిలే ప్రసక్తే లేదంటున్నారు. లింగమయ్య తాను తాగిన మజ్జిగ గ్లాసును చూడండి అంటూ అందరికీ చూపుతుండటం అనుమానాలకు తావిస్తోంది. పక్కా పథకం ప్రకారమే లింగమయ్య భార్యపై నేరం మోపే నాటకం ఆడుతున్నాడని నాగమణి బంధువులంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.