ఏపీలోమరో అక్టోపస్: నాని ముందే చెప్పాడు
ఏ ఎన్నికలైనా సరే.. లగడపాటి రాజగోపాల్ చెప్పే ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి ఉండేది.
విజయవాడ: ఏ ఎన్నికలైనా సరే.. లగడపాటి రాజగోపాల్ చెప్పే ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి ఉండేది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగపాటి రాజగోపాల్ ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు తారుమారాయి. అయితే విజయవాడ ఎంపీ కేశినేని నాని లగడపాటి తరహాలోనే ఎన్నికల ఫలితాలపై జోస్యం చెబుతున్నారు. ఆయన చెప్పినట్టుగానే ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఏపీకి మరో ఆంధ్రా అక్టోపస్ దొరికాడనే ప్రచారం ప్రారంభమైంది.
2009 ఎన్నికల్లో పీఆర్పీ నుండి కేశినేని నాని పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు.
2014 ఎన్నికలకు ముందు విజయవాడ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని నాని చెప్పారు. నాని ఊహించినట్టుగానే విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ నేత శ్రీధర్ మేయర్ గా ప్రస్తుతం కొనసాగుతున్నారు.
మరోవైపు కృష్ణా జిల్లాలో ఎక్కువ గ్రామ పంచాయితీలు, మండలాలను కౌైవసం చేసుకొంటాయని కూడ నాని చెప్పారు. నాని చెప్పినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొంది. కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ ఛైర్మెన్ స్థానాన్ని టీడీపీ గెలుచుకొంది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తోందని కూడ కేశినేని నాని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ వందకు పైగా స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకొంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూ కేశినేని నాని చెప్పిన జోస్యం నిజమైంది.
తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పీపుల్స్ ఫ్రంట్గా ఏర్పడి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, రాహుల్ గాంధీలు ప్రచారంతో అనుకూల ఫలితాలు వస్తాయని భావించారు.
కానీ, తెలంగాణలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరో విధంగా ఉన్నాయని కేశినేని నాని సహచర ఎంపీల దృష్టికి తెచ్చారు.టీఆర్ఎస్కు 80 స్థానాలు కైవసం చేసుకొనే అవకాశం ఉందని నాని చెప్పారు. నాని చెప్పినట్టుగానే టీఆర్ఎస్కు 88 స్థానాలు దక్కాయి.
టీడీపీకి రెండు లేదా మూడు స్థానాలు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని నాని చెప్పినట్టుగానే టీడీపీకి 2 స్థానాలు మాత్రమే దక్కాయి. రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపి వందకు పైగా స్థనాలను గెలుపొందే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు.