కరోనా విలయానికి గురైన మానవాళిని రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ టిడిపి చీఫ్ చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు.
అమరావతి: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా అందించిన సేవలు అజరామరం అని కొనియాడారు.
''వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ప్రాణాలు నిలబెడతారు కాబట్టే వైద్యులను భగవంతునితో పోల్చారు. కరోనా విలయానికి గురైన మానవాళిని రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యక్ష దైవాలకు చేతులెత్తి మొక్కుతున్నాను'' అన్నారు.
''కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ ప్రాణోపాయమని తెలిసీ ప్రాణాలకు తెగించి నిర్విరామంగా శ్రమిస్తున్నారు వైద్యులు. ఈ మహత్తర క్రతువులో మానవసేవే మాధవసేవని నమ్మి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ మీరు చేస్తున్న పోరాటం చిరస్మరణీయం'' అని వైద్యులను కొనియాడారు.
'' వృత్తిపై అంకితభావంతో రాత్రింబవళ్లు కరోనా బాధితుల కోసం పనిచేస్తున్న వైద్యుల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యవహరిస్తున్న తీరు చూస్తే మనసుకు బాధ కలుగుతోంది. కరోనాపై పోరులో వైద్యులదే కీలకపాత్ర అని గుర్తించి ప్రపంచమంతా వారిపై పూలు చల్లి ప్రశంసిస్తుంటే ఏపీలో నేటికీ డాక్టర్లకు కనీసం రక్షణ పరికరాలు కూడా ఇవ్వని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యుల సేవలను గుర్తించాలి. ప్రజల ప్రాణాలను రక్షిస్తున్న వైద్యులకు ప్రభుత్వం రక్షణగా నిలవాలి'' అని చంద్రబాబు కోరారు.
