Asianet News TeluguAsianet News Telugu

జగన్ అపాయింట్‌మెంట్ దొరకలేదు.. అందుకే మాట్లాడా: రఘురామకృష్ణంరాజు

షోకాజ్ నోటీసుపై స్పందించారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. బుధవారం ఓ వీడియో విడుదల చేసిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్‌ను కానీ.. పార్టీని కాను తాను పల్లెత్తు మాట కూడా అనలేదని స్పష్టం చేశారు

narsapuram ysrcp mp raghurama krishnam raju reacts on show cause notice
Author
Amaravathi, First Published Jun 24, 2020, 6:25 PM IST

షోకాజ్ నోటీసుపై స్పందించారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. బుధవారం ఓ వీడియో విడుదల చేసిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్‌ను కానీ.. పార్టీని కాను తాను పల్లెత్తు మాట కూడా అనలేదని స్పష్టం చేశారు.

సీఎం జగన్ అప్పాయింట్‌మెంట్ దొరక్కపోవడంతోనే బహిరంగంగా మాట్లాడాల్సి వచ్చిందని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. తనకు వైసీపీ అధిష్టానం నుంచి 18 పేజీల షోకాజ్ నోటీసు అందిందని, రేపటిలోగా సమాధానం ఇస్తామని ఎంపీ వెల్లడించారు.

ప్రభుత్వంలో ప్రజల మంచి కోసం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు  కొన్ని చోట్ల సజావుగా జరగడం లేదన్న దానిపై తాను కొన్ని సూచనలు చేశారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. వీటిలో తిరుపతి దేవస్థానం భూముల విషయంతో పాటు మరికొన్ని అంశాలపై స్పందించానని ఎంపీ పేర్కొన్నారు.

Also Read:షాక్: ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీస్

అది కేవలం ప్రభుత్వానికి సూచన తప్పించి పార్టీకి ఎటువంటి సూచనా కాదని ఆయన తేల్చి చెప్పారు. షోకాజ్ నోటీసుపై స్పందించేందుకు ఏడు రోజుల సమయం ఇచ్చినప్పటికీ, తాను రేపే వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి సంజాయిషీ ఇస్తానన్నారు. 

అంతకుముందు తన వల్లే తన నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారన్నారు. జగన్ బొమ్మవల్ల తాను విజయం సాధించలేదన్నారు. తనను బతిమిలాడితేనే పార్టీలో చేరినట్టుగా ఆయన ప్రకటించారు.

ఈ వ్యాఖ్యలపై వైసీపీకి చెందిన ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఎంపీని కోరారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ మరో వైపున విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొన్నారు. 

Also Read:జగన్ విధానమే : వల్లభనేని వంశీ, టీడీపీ ఎమ్మెల్యేల బాటలోనే రఘురామ

రఘురామకృష్ణంరాజు కామెంట్స్ పై పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి చెందిన క్యాడర్ దిష్టిబొమ్మలు దగ్దం చేశారు.  ఈ విషయమై రఘురామకృష్ణం రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు తాను జిల్లాలో పర్యటిస్తే తనపై దాడి చేస్తారని బెదిరింపులకు పాల్పడ్డారని కూడ ఆయన ఆరోపించారు. 

జిల్లాలో పర్యటించే సమయంలో భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు.  అంతేకాదు ఇదే విషయమై పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాకు కూడ ఆయన లేఖ రాశాడు. ఈ  లేఖను స్పీకర్ కేంద్ర హోం శాఖకు పంపినట్టుగా తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలపై చేసిన విమర్శలపై వారం రోజుల్లోపుగా సమాధానం చెప్పాలని రఘురామకృష్ణంరాజుకు ఇవాళ వైసీపీ నాయకత్వం షోకాజ్ నోటీసు పంపింది

Follow Us:
Download App:
  • android
  • ios