సీఎంలిద్దరూ మంచి మిత్రులే... అనుకుంటే క్షణాల్లో ఆ సమస్యకు పరిష్కారం: భద్రాచలం ఆలయంలో లోకేష్ (వీడియో)
పోలవరం నిర్వాసిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రాచలం సీతారామస్వామిని దర్శించుకున్నారు.
ఖమ్మం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించనున్న లోకేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకుని భద్రాచలంలో సీతారామ స్వామిని దర్శించుకున్నారు.
లోకేష్ కు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. సీతారామస్వామి దర్శనం అనంతరం లోకేష్ ను శాలువాతో సత్కరించారి జ్ఞాపిక అందజేశారు ఆలయ సిబ్బంది. అనంతరం అర్చకులు వేదమంత్రాలతో లోకేష్ కు ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... కరోనా కష్టాలు కడతేరాలని రామచంద్రమూర్తిని కోరుకున్నట్లు తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలు ప్రగతి సాధించాలని స్వామివారిని కోరానని అన్నారు. దైవదర్శనం చేసుకుని వచ్చాను కాబట్టి రాజకీయాలు మాట్లాడనని లోకేష్ అన్నారు.
వీడియో
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు సురక్షితంగా వుండాలని స్వామిని మొక్కుకున్నారని అన్నారు. కరోనా కష్టాలు కడతేరాలని... ప్రజలంతా ఆయురారోగ్యాలతో వుండాలని కోరుకున్నానని అన్నారు. తెలుగు రాష్ట్రాలు సఖ్యతతో ఉండి పరస్పర ప్రయోజనాలు గౌరవించుకుని ప్రగతిపథంలో సాగాలన్నారు.
పోలవరం నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కారం కావాలని రామచంద్రమూర్తికి మొక్కుకున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య భద్రాచలం కేంద్రంగా సమస్యగా వున్న 5 పంచాయతీల గురించి మాట్లాడుతూ ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి స్నేహితులే కదా వారు అనుకుంటే క్షణాల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు లోకేష్.