2024లో అధికారం టిడిపిదే... అప్పుడు వడ్డితో సహా చెల్లించే బాధ్యత నాదే: లోకేష్ వార్నింగ్
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో అమరజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాలను నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: చివరికి చెత్తపైనా యూజర్ చార్జీల పేరుతో పన్నులేసిన జగన్ చెత్త ప్రభుత్వంపై జనమంతా ఆగ్రహంగా వున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కాబట్టి 2024లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని లోకేష్ పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురంలో అమరజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాలను లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ... పొట్టి శ్రీరాములు ఆంధ్రజాతి కోసం తన ప్రాణాలనే త్యాగం చేశారని గుర్తుచేశారు. ఆ మహనీయుని విగ్రహం ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు.
''తెలుగోడి సత్తా దేశానికి చాటిచెప్పిన ఘనత ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అనతికాలంలోనే అధికారంలోకి వచ్చి కిలో రూపాయి బియ్యం, ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు, బడుగు బలహీనవర్గాలకు రాజకీయ అవకాశాలు వంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో తెలుగుజాతి అభ్యున్నతికి పాటుపడ్డారు. ఆ మహా నాయకుడు అన్న ఎన్టీఆర్ మనవడిగా కాకుండా ఆయన స్థాపించిన పార్టీ కార్యకర్తగా ఆయన ఆశయసాధనకి కృషి చేస్తాను'' అని లోకేష్ ప్రతినబూనారు.
''కొందరు కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి అధికారంలోకి వచ్చారు. అలాంటివారు తెలుగుదేశం భూస్థాపితం అవుతుందంటున్నారు... కానీ ఈ పార్టీని టచ్ చేయడం వాళ్ల నాయన వైఎస్సార్ వల్లే కాలేదు... ఈ కొడుకు గెడ్డంలో వెంట్రుక కూడా పీకలేడు'' అని విరుచుకుపడ్డారు.
read more భావప్రకటన స్వేచ్చ కేవలం వైసిపి వారికేనా ... మాకు వర్తించదా?: డిజిపికి వర్ల రామయ్య లేఖ
''రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడ్డారు... 2014-2019 వరకూ అభివృద్ధి-సంక్షేమంపైనే ఆయన దృష్టి పెట్టారు. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలకి దూరమయ్యామనే బాధ పార్టీ అధినాయకత్వంలో వుంది. కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులంటే కార్యకర్తలే. మీ వెనుక మేముంటామని కార్యకర్తలు ప్రజల్ని చైతన్యం చేయాలి'' అని లోకేష్ పిలుపునిచ్చారు.
''టిడిపి నాయకులు, కార్యకర్తల్ని అక్రమంగా, చట్టవ్యతిరేకంగా నిర్బంధిస్తూ కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తోన్న అధికారులకు రానున్న తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తనదే'' అని లోకేష్ హెచ్చరించారు.
''మాయల పకీరులాంటి జగన్రెడ్డి పాదయాత్రలో జనానికి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. నాడు అన్నింటి ధరలు పెంచుతూ పోతున్నామన్నాడు.. నేడు ఆయనే క్వార్టర్ బాటిల్, సిమెంట్, విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరలన్నీ పెంచేశాడు. పెట్రోల్, డీజిల్ ధరలు జగన్ ట్యాక్స్ల దెబ్బకి డబుల్ సెంచరీ దిశగా వెళుతున్నాయి'' అని విమర్శించారు.
''జగన్ రెండున్నరేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమా రాలేదు... ఇక ప్రత్యేకహోదా మాటే మరిచిపోయారు. 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే ఢిల్లీని గడగడలాడిస్తామన్న జగన్రెడ్డి... 22 మంది గెలిచినా ఢిల్లీ పెద్దల్ని చూసి గజగజ వణికిపోతున్నారు. ప్రధాని మోడీ కనిపిస్తే చాలుకేసుల మాఫీ కోసం కాళ్లు పట్టుకుంటున్నారు'' అని లోకేష్ మండిపడ్డారు.
''ఈ అరాచకపాలనపై పోరాడుదాం...ఎవ్వరూ భయపడొద్దు. ప్రజల్ని చైతన్యవంతంచేసి దుర్మార్గ జగన్రెడ్డి పాలనపై ఉద్యమించకపోతే భవిష్యత్ తరాలూ నష్టపోతాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తలచుకుంటే జగన్రెడ్డి బయట తిరిగేవారా?'' అని సీఎం జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు.