Asianet News TeluguAsianet News Telugu

ప్యాక్షన్ రెడ్డి గీత దాటావ్... ఇక నీ సరదా తీరుస్తాం..: జగన్ కు లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

కక్ష సాధింపే ముఖ్యమైతే తన మీద కేసులు పెట్టుకోమని... టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికి రావొద్దని జగన్ కు అనేకసార్లు చెప్పానని లోకేష్  అన్నారు. 

nara lokesh strong warning to cm ys jagan akp
Author
Kurnool, First Published Jun 18, 2021, 1:48 PM IST

కర్నూల్: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం పెసరవాయిలో గురువారం ఇద్దరు టిడిపి నాయకులు అతి కిరాతకంగా హత్యకు గురయిన విషయం తెలిసిందే. దుండగుల దాడిలో మరికొందరు గాయపడ్డారు. బాధిత కుటుంబాలను, గాయపడిన వారిన పరామర్శించేందుకు ఇవాళ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెసరవాయిలో పర్యటించారు. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సీఎం జగన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఫ్యాక్షన్ రెడ్డికి అనేక సార్లు చెప్పాను... కక్ష సాధింపే ముఖ్యమైతే తన మీద కేసులు పెట్టుకోమని... టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికి రావొద్దని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తామూ ఇలాగే ప్రవర్తిస్తే నీ పార్టీ ఎక్కడ ఉండేదో ఒక్క సారి ఆలోచించుకో అంటూ లోకేష్ హెచ్చరించారు. 

''ఫ్యాక్షన్ రెడ్డి గీత దాటాడు. నేను ఈ రోజు చెప్తున్నా అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తా. అధికారంలోకి రాగానే చంద్రబాబు అన్నీ మర్చిపోయి అభివృద్ధి అంటూ పరిగెడతారు... బెంగుళూరు ప్యాలస్ లో ఎంజాయ్ చెయ్యొచ్చు అనే ఆలోచనలో ఫ్యాక్షన్ రెడ్డి ఉన్నారు. ఈ సారి అలా ఉండదు ఫ్యాక్షన్ రెడ్డి సరదా తీరిపోయేలా చేస్తాం'' అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 

''రాజారెడ్డి రాజ్యాంగం ఉంది, ఫ్యాక్షన్ రెడ్డి అండగా ఉన్నాడని వైకాపా నాయకులు రెచ్చిపోతే ఎవ్వరిని వదలం. చేసిన ప్రతి దాడి, హత్యల్లో భాగస్వామ్యం అయిన అందరూ శిక్ష అనుభవించేలా చేస్తాం. గ్రామాల‌లో శాంతి నెల‌కొల్ప‌డానికి,స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికి తెలుగుదేశం ఎప్పుడూ సిద్ధమే. కుదరదు అంటే ఫైనల్ గా ఫ్యాక్షన్ రెడ్డికి ఒక్కటే చెబుతున్నా ఫ్యాక్షన్ ని నమ్ముకున్న వాడు ఫ్యాక్షన్ లోనే పోతాడు'' అన్నారు. 

''జగన్ రెడ్డి కి ప్రజలు అధికారం ఇచ్చింది ఎందుకు?సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని. కానీ జగన్ రెడ్డి చేస్తోంది ఏంటి? ప్రతీకారం, విద్వేషం, విధ్వంసం, దాడులు, హత్యలు. జగన్ రెడ్డి అసలు అవతారం బయటపడింది. ఆయన జగన్ రెడ్డి కాదు ఫ్యాక్షన్ రెడ్డి అని రెండేళ్ల పాలనలో తేలిపోయింది. ఫ్యాక్షన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నాడు. ఫ్యాక్ష‌న్ రెడ్డి గ్యాంగులు వేట‌కొడ‌వ‌ళ్లు, క‌త్తులు, గొడ్డ‌ళ్ల‌కు ప‌దునుపెట్టి ప‌ల్లెల్లో ప్ర‌తీకారాల‌కు దిగుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ ని బీహార్ లా మార్చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

read more  కబడ్దార్... మూల్యం చెల్లించుకోక తప్పదు: టిడిపి నాయకుల హత్యపై చంద్రబాబు సీరియస్

''ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో మళ్లీ రక్తం పారిస్తున్నారు. రాయలసీమలో చంద్రబాబు నీరు పారిస్తే,ఫ్యాక్షన్ రెడ్డి రక్తం పారిస్తున్నాడు. చంద్రబాబు హయాంలో రాయలసీమకి కంపెనీలు,ప్రాజెక్టులు వస్తే ఫ్యాక్షన్ రెడ్డి పాలనలో ఫ్యాక్షనిస్టులు గన్నులు, కత్తులతో వస్తున్నారు. టీడీపీ హయాంలో కర్నూలు జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించాం. కర్నూలు జిల్లాకు సాగు నీరు అందించే లక్ష్యంతో పులకుర్తి ఎత్తిపోతల పథకం, సిద్దాపురం ఎత్తిపోతల పధకం, మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, కర్నూల్ సోలార్ పార్క్, మెగా సీడ్‌ పార్క్‌, ఓర్వకల్లు విమానాశ్రయం, ఐఐటిడిఎం, ఉర్దూ యూనివర్సిటీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు వున్నాయి'' అన్నారు. 

''కానీ ఫ్యాక్షన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ రెండేళ్లుగా మాయ మాటలు  చెప్తున్నారు. ఒక్క అభివృద్ధి పనికైనా ఫ్యాక్షన్ రెడ్డి శంకుస్థాపన చేశారా? ఫ్యాక్షన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుండీ ఒక్క రోజు కూడా ప్రజల గురించి ఆలోచించలేదు. 24 గంటలూ ఒక్కటే ఆలోచన ప్రతిపక్ష పార్టీ నాయకుల పై దాడులు,అరెస్టులు,హత్యలు. ఈ రెండేళ్ల పాలనలో టీడీపీ శ్రేణులపై దాడులు చేసిన ఘటనలు 1400.అత్యంత కిరాతకంగా 27 మందిని హత్య చేశారు. వేలాది మంది టీడీపీ కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేశారు. కొన్నిచోట్ల  గ్రామాల నుండి తరిమేసి సంబంధాలు లేకుండా రహదారులకు అడ్డంగా గోడలు నిర్మించారు'' అని మండిపడ్డారు.

''పాణ్యం నియోజకవర్గం పెసరవాయిలో టిడిపి నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ వడ్డు నాగేశ్వర రెడ్డి గారిని,వారి సోదరుడు, గడివేముల మాజీ సహకార సంఘం ప్రెసిడెంట్ వడ్డు ప్రతాప్ రెడ్డి గారిని వైకాపా ఫ్యాక్షనిస్టులు అత్యంత దారుణంగా హత్య చేసారు. వైకాపా ఫ్యాక్షనిస్టులు శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ధామోధర్ రెడ్డి లు 15 మంది అనుచరులతో తమ సొంత రెండు వాహానాల్లో వెనుక వైపు నుండి ఢీ కొట్టారు. 
క్రింద పడిన వారిపై శ్రీకాంత్ రెడ్డి, రాజారెడ్డి, ధామోధర్ రెడ్డి లు తమ అనుచరులతో కలసి వేట కొడవళ్లతో మూకుమ్మడిగా దాడి చేసి నరికారు. ఈ దాడిలో ఇద్దరు అన్నదమ్ములు నాగేశ్వర రెడ్డి, ప్రతాప్ రెడ్డి లు అక్కడికక్కడే మృతి చెందారు. దాడిలో గాయపడిన నాగేశ్వర్ రెడ్డి, సుబ్బా రెడ్డి, వెంకటేశ్వర్లులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు'' అని తెలిపారు.

''పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు అడ్డుపడ్డారు అనే కక్షతో కిరాతకంగా హత్య చేసారు. ఇద్దరు అన్నదమ్ములు పాణ్యం వైసిపి ఎమ్మెల్యే నుండి తమకు ప్రాణ హాణి ఉందని,తమకు రక్షణ కల్పించాలని అనేక సార్లు పోలీసులను కోరినా పట్టించుకోలేదు. ఈ ఏడాది 09-01-2021న స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉందని చెప్పి రివాల్వర్ ను పోలీసులు సరెండర్ చేసుకున్నారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసాక తుపాకులు సరెండర్ చేసిన వారిలో వైసిపి వారికి తిరిగి ఇచ్చారు. నాగేశ్వర్ రెడ్డికి మాత్రం ప్రాణ రక్షణ కోసం తెచ్చుకున్న లైసెన్స్ రివాల్వర్ ను ఇప్పటి వరకు పోలీసులు ఇవ్వలేదు. అంటే ఎంత పక్కాగా ప్లాన్ చేసి మర్డర్ చేసారో అర్ధమవుతుంది'' అని ఆరోపించారు. 

''దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు ఉన్నాయి. మొత్తం రికార్డ్ అయ్యింది.అయినా ఇప్పటివరకూ ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు. వైకాపా యూనిఫామ్ వేసుకున్న కొంతమంది పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగానికి బానిసలుగా మారారు. వైకాపా ఫ్యాక్షనిస్టులు హత్యలు చేస్తే వైకాపా యూనిఫామ్ వేసుకున్న పోలీసులు అది హత్య కాదు ఆత్మహత్య అంటారు. వైకాపా రౌడీలు దాడి చేస్తే అది దాడి కాదు వాళ్లకు వాళ్లే కొట్టుకున్నారని అంటారు. అసలు ప్రాధమిక విచారణ కూడా జరపకుండానే ఫ్యాక్షన్ హత్య కాదు,రాజకీయ కోణం లేదు వ్యక్తిగత కక్షలే అని కేసుని నీరుగారుస్తారు'' అని మండిపడ్డారు.

''రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీసులకు ఒక్కటే చెప్తున్నాను. అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్షన్ రెడ్డి గ్యాంగులకు అండగా ఉండి వారిని కాపాడుతున్న అధికారులను వదిలిపెట్టం. ఖచ్చితంగా చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు. వడ్డి నాగేశ్వర రెడ్డి, వడ్డి ప్రతాప్ రెడ్డిల‌ కుటుంబాలకు టిడిపి అండగా ఉంటుంది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న నాగేశ్వర్ రెడ్డి, సుబ్బా రెడ్డి, వెంకటేశ్వర్లులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. పార్టీ వారికి అన్నీ విధాలుగా అండగా ఉంటుంది'' అని లోకేష్ మండిపడ్డారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios