సహజీవనం చేసుకోండంటూ... ఆ పనిలో జగన్ బిజీ: నారా లోకేష్ సంచలనం
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అరెస్ట్ పై నారా లోకేష్ స్పందిస్తూ... వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు: కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన వర్గీయులు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేశారనే ఆరోపణపై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ... వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
''సహజీవనం చేసుకోండి అంటూ ప్రజల్ని కరోనాకి బలిస్తూ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు పనిలో బిజీగా ఉన్నారు జగన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డితో పాటు ఇతర నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్రమ కేసులు నిలవవు అని తెలిసినా ప్రతిపక్ష నేతల్ని వెంటాడి, వేధించి జైలుకి పంపి జగన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారు'' అని మండిపడ్డారు.
''గతంలో చేసిన తప్పులకు పదుల సంఖ్యలో అధికారులు జైలుకి వెళ్లారు. ఇప్పుడు జగన్ రెడ్డి చేస్తున్న తప్పుడు పనులకు వందల సంఖ్యలో అధికారులు జైలుకు పోవడం ఖాయం. అక్రమ కేసులు ఉపసంహరించుకొని బిసి జనార్దన్ రెడ్డి ఇతర నేతలను వెంటనే విడుదల చెయ్యాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.
read more దాడి ఘటన: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టు
ఇదిలావుంటే బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఆయన అనుచరులు పోలీసు వాహనాలను స్టేషన్ వరకు అనుసరించారు. తొలుత కాటసాని రామిరెడ్డి అనుచరులు బీసీ జనార్నద్ రెడ్డి నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు పైపులతో కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.
తమ అనుచరులను కాటసాని రామిరెడ్డి అనుచరులు ఇంటి వద్దకు వచ్చి రెచ్చగొట్టారని బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే, బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు అందరూ చూస్తుండగానే పైపులతో తమపై దాడి చేశారని కాటసాని రామిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.