అలా చేసినందుకు... సీఎం జగన్ ను నడిరోడ్డుపై ఉరి తియ్యాలా?: నారా లోకేష్ సంచలనం
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేసేజ్ లు ఫార్వర్డ్ చేసినందుకు ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్ ను జగన్ సర్కార్ సస్పెండ్ చేయడాాన్ని టిడిపి నాయకులు లోకేష్ తప్పుబట్టారు.
విశాఖపట్నం: తనకు వచ్చిన మేసేజ్ లను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశాడని ప్రభుత్వం ఉపాధ్యాయున్ని జగన్ సర్కార్ సస్పెండ్ చేయడాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు.
విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాల ఎస్జీటి టీచర్ గా పనిచేస్తున్న ఎస్. నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్నాడంటూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆయనపై స్పెన్షన్ వేటు వేశారు. అమలాపురానికి చెందిన ఎస్.వి.వి సత్యనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదుతో నిబంధనల మేరకు నాయుడపై చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారి వెల్లడించారు. ఈ సస్పెన్షన్ పై లోకేష్ స్పందిస్తూ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు.
read more మాస్క్ పెట్టుకోని జగన్ కు ఏ శిక్ష విధిస్తారు??.. నారా లోకేష్ ఫైర్...
''సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్ ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే, విద్యాబుద్ధులు నేర్పే గురువులకు తన చీప్ లిక్కర్ అమ్మే మద్యం దుకాణాల ముందు డ్యూటీవేసిన వైఎస్ జగన్ గారిని ఏం చెయ్యాలి? నడిరోడ్డు మీద ఉరి తియ్యాలా?'' అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికన విరుచుకుపడ్డారు.
''సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ విశాఖ జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్.నాయుడు గారిని సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తూ భావవ్యక్తీకరణ స్వేచ్చని హరిస్తోంది వైకాపా ప్రభుత్వం'' అని ఆరోపించారు.
''మాస్టారిపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివెయ్యాలి. జగన్ రెడ్డి పాలనలో టీచర్లను వేధించడం పరిపాటిగా మారింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది'' అని లోకేష్ ప్రకటించారు.