నల్లారిపై దాడి : ఫ్యాన్ గుర్తంతా ఫ్యాక్షన్ మయమే.. నారాలోకేష్ ఫైర్
జగన్రెడ్డి జంగిల్ రాజ్యంలో ప్రజలకు, ప్రతిపక్షనేతలకు రక్షణ లేకుండా పోయిందంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ఫ్యాన్ గుర్తు అధినేత నుంచి కార్యకర్త వరకూ అందరూ ఫ్యాక్షన్ మనస్తత్వం వున్నవారే అంటూ ఎద్దేవా చేశారు.
జగన్రెడ్డి జంగిల్ రాజ్యంలో ప్రజలకు, ప్రతిపక్షనేతలకు రక్షణ లేకుండా పోయిందంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ఫ్యాన్ గుర్తు అధినేత నుంచి కార్యకర్త వరకూ అందరూ ఫ్యాక్షన్ మనస్తత్వం వున్నవారే అంటూ ఎద్దేవా చేశారు.
చనిపోయిన టిడిపి కార్యకర్తలను పరామర్శించేందుకు టిడిపి నేతలు నల్లారి కిశోర్కుమార్రెడ్డి, శంకర్యాదవ్లు వెళ్తుండగా వైకాపా కార్యకర్తలు కాన్వాయ్పై దాడి చేసినా, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం చూస్తుంటే..ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చేశారని అర్థమవుతోందని మండిపడ్డారు లోకేష్.
పోలీసులకేమైంది? ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుని వైకాపా కోసం పనిచేయడం సిగ్గుచేటు. మీరు ప్రజారక్షకభటులా? ప్రజలపై కక్షకట్టిన భటులా? అని ప్రశ్నించారు. దాడిలో గాయపడిన
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని, దాడిలో గాయపడిన టీడీపీ నేతలను నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు.
వైకాపా నేతల దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, ప్రజాసమస్యలపై తెదేపా పోరాటం కొనసాగుతుందని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత డీజీపీదేనన్నారు.
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద టిడిపి నాయకులపై వైసిపి దాడిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి,మధుబాబు మరో ముగ్గురిని తీవ్రంగా గాయపర్చడం, వాహనాలను ధ్వంసం చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బి.కొత్తకోటలో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాల పరామర్శకు వెళ్తున్న నాయకులపై దాడి గర్హనీయం అని జగన్మోహన్ రెడ్డి ఫాసిస్ట్ పాలనకు ఈ దాడులు అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా(చట్టబద్దమైన పాలన)కు గండికొట్టారు. జగన్ అండతో వైసిపి ఫాసిస్ట్ మూకలు రెచ్చిపోతున్నాయి. ఏ నేరానికి పాల్పడినా ఎవరేం చేయరనే ధీమాతో నిందితులంతా పేట్రేగిపోతున్నారన్నారు.
ఇప్పటికే రాష్ట్రం నుంచి పెట్టుబడులన్నీ తరలిపోయాయి. కొత్తగా పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడం పెనంమీద పుట్ర అయ్యింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి. పోలీసు వ్యవస్థ మళ్లీ పునరుజ్జీవం కావాలి. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఇదిలా ఉండగా రాష్ట్రాన్ని వైసీపీ నేతల రావణ కాష్టంలా మారుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు టీడీపీ నేత కింజారపు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం నాయకులపై వైసీపీ పిరికి పంద చర్యను ఖండిస్తున్నామన్నారు. జగన్ ఫ్యాక్షన్ రాజకీయాన్ని పెంచి పోషిస్తున్నారు. బెదిరింపు రాజకీయాలతో, కక్షపూరిత వైఖరిని జగన్ అవలంభిస్తున్నారు. దాడికి పాల్పడ్డ నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రాన్ని వైసీపీ నేతల రావణ కాష్టంలా మారుస్తున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ లు బి.కొత్తకొట మండలంలో సమావేశానికి వెళ్తుండగా కురబలకోట మండలం అంగళ్లులో 200 మంది వైసీపీ నాయకులు రాళ్లతో దాడి చేసి హత్యాప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు రాటకొండ మధుబాబు తలకు తీవ్ర గాయలయ్యాయి. 4 కార్లు ద్వంసం అయ్యాయి. జర్నలిస్టు ఫోన్, కెమేరా లాక్కొని దాడికి దిగిన విషయం తెలిసిందే.