సీఎం జగన్ కు నారా లోకేష్ బహిరంగ లేఖ..!
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో.. జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి హామీలు ఇచ్చారని.. వాటిని నెరవేర్చాలని లోకేష్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి టీడీపీ నేత నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో.. జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి హామీలు ఇచ్చారని.. వాటిని నెరవేర్చాలని లోకేష్ పేర్కొన్నారు.
ప్రతి ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తానని ఓసారి, రూ.10 లక్షలు ఇస్తానని మరోసారి మాట మార్చారని మండిపడ్డారు. భూమి లేని వారికి రూ.10 లక్షలు ప్యాకేజ్ ఇస్తానని, వలస వెళ్లిన వారికి కూడా ప్యాకేజీ అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని… జగన్ సీఎం అయినా ఒక్క హామీ నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. నిర్వాసితుల సమస్య చిన్నదంటున్న మంత్రులు.. దాని పరిష్కారానికి చిన్న ప్రయత్నమైనా చేయడం లేదన్నారు.
పోలవరం నిర్వాసితులైన 275 గ్రామాలకు గాను 9 గ్రామాల్లో అరకొరగా మాత్రమే పరిహారం అందించారని… 41.15 మీటర్ల కాంటూరు నిర్వాసితుల పరిహారానికి కేవలం రూ.550 కోట్లే విడుదల చేశారని వెల్లడించారు. అందులోనూ రూ. 100 కోట్లు మింగేయడం చాలా దారుణమని… వైఎస్ విగ్రహానికి మాత్రం రూ.200 కోట్లు కేటాయించారని నిప్పులు చెరిగారు. ఇదేమి అన్యాయం? కనీసం మీరిచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం దారుణమని తెలిపారు నారా లోకేష్.