అలా చేయండి: పవన్, జగన్ లకు నారా లోకేష్ సవాల్
కట్టుబట్టలతో మెడ పట్టుకుని రాష్ట్ర విభజన సమయంలో నెట్టేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
నెల్లూరు: కట్టుబట్టలతో మెడ పట్టుకుని రాష్ట్ర విభజన సమయంలో నెట్టేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అప్పులు మన నెత్తి మీద పెట్టారని ఆయన అన్నారు. అనాథలుగా వదివలేశారని అన్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడిందని, అయినా దళితులకు లోటు లేకుండా చంద్రబాబు పాలిస్తున్నారని ఆయన అన్నారు. దళితుల అభివృద్ధి టీడీపి ప్రభుత్వాల హయాంల్లోనే జరిగిందని అన్నారు. నెల్లూరు దళిత తేజం సభలో ఆయన శనివారం ప్రసంగించారు.
ఎన్టీఆర్ మహేంద్రనాథ్ ను ఆర్థిక మంత్రిని చేశారని, చంద్రబాబు బాలయోగిని లోకసభ స్పీకర్ ను చేశారని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందని ఆయన అన్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. గ్రామాల్లో ఏ కార్యక్రమం ప్రారంభించినా దళిత వాడతో మొదలు పెట్టాలని చంద్రబాబు చెప్పినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుపై అనేక ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.
పవన్ కల్యాణ్, జగన్ లు కలిసి చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. పవన్, జగన్ తమ పోరాటాలను కేంద్ర ప్రభుత్వం మీద చేయాలని ఆయన సవాల్ చేశారు. తాము తప్పు చేస్తే సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెట్టాలని, అర్థం పర్థం లేని ఆరోపణలు చేయవద్దని ఆయన అన్నారు. ఏ రోజు కూడా తనపై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని అన్నారు.
పవన్ కల్యాణ్ తనలాంటి యువకుడ్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లో ఉంటానని అన్నారు. తాతగారి వంటి, నాన్నగారి వంటి పేరు తనకు రాకపోవచ్చు గానీ వారికి తలవంపులు తెచ్చే పనిచేయబోనని అన్నారు.
భారతీయ జనతా పార్టీ జగన్, పవన్ కల్యాణ్ పార్టీ అని ఆయన అన్నారు. బిజెపి మతం చిచ్చు పెట్టాలని చూస్తోందని అన్నారు. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రకు వెళ్లి డిక్లరేషన్, మనం ఎన్డీఎ నుంచి బయటకు రాగానే కర్నూలు డిక్లరేషన్ పెట్టిందని, ఇది చిచ్చు పెట్టడమేనని ఆయన అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా తమ పార్టీ పనిచేస్తుందని ఆయన చెప్పారు.