నా విషయంలో హరి మావయ్య కూడా అంతే: నారా లోకేష్ భావోద్వేగం
టిడిపి మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ 65వ జయంతి సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు.
మంగళగిరి: తన మేనమామ నందమూరి హరికృష్ణ 65వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు. మామయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికన హరికృష్ణకు నివాళి అర్పించారు.
''కొందరు మన మధ్య లేకపోయినా వారితో మనకు ఉన్న అనుబంధం వారిని సజీవంగా మన కళ్ళ ముందు ఉంచుతుంది. నా విషయంలో హరి మావయ్య కూడా అంతే. ఆయన జయంతి సందర్భంగా హరి మావయ్య స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
read more తమిళనాడు సీఎం స్టాలిన్ పై పవన్ ప్రశంసల వర్షం..!
1956 సెప్టెంబర్ 2న ఎన్టీ రామారావు-బసవతారకం దంపతులకు హరికృష్ణ జన్మించారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఆయన కొనసాగారు. అయితే ఈ రెండింటిలోనూ ఆయన రాణించలేకపోయారు. కానీ తన తనయులను మాత్రం సినిమాల్లో మంచి స్థాయికి చేర్చారు. ముఖ్యంగా హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరో.
2018 ఆగస్టు 29వ తేదీన హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురికావడం జరిగింది. నార్కెట్ పల్లి వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో హరికృష్ణ తీవ్రగాయాలపాలయ్యారు. దీంతో ప్రమాద స్థలంలోనే హరికృష్ణ కన్నుమూశారు.
తన సోదరుడు హరికృష్ణ జయంతి సందర్భంగా సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ''హరన్న అంటే ధైర్యం,హరన్న అంటే ఆత్మవిశ్వాసం,హరన్న అంటే మొండితనం,హరన్న అంటే తెలుగుతనం. మా అన్న హరన్న జయంతి నేడు. ఈరోజు ఆయన మా మధ్య లేకపోయినా మా మనసుల్లో ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. మా హరన్న ఎక్కడ ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను''... అంటూ బాలకృష్ణ పేస్ బుక్ లో కామెంట్ పెట్టారు.