విభజన హామీలపై అఖిలపక్షం..ఒత్తిడికి లొంగిన చంద్రబాబు
- రాష్ట్ర విభజన హామీలపై చర్చకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
మొత్తానికి చంద్రబాబునాయుడు ఒత్తిడికి లొంగిపోయి అఖిలపక్షానికి అంగీకరించారు. సోమవారం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం పనులను పరిశీలించించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలపై చర్చకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్ని పార్టీలను సమావేశపరిచి విభజన హామీలపై చర్చిస్తామని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అనేక హామీలు అమలుకావడంలేదని, సమస్యలు ఎందుకు పరిష్కరించడంలేదో ప్రజలకు కేంద్రం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.
ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కేంద్రం వ్యవహరించాలని సూచించారు. పోలవరం పనులు పూర్తికాకుండా వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. టీడీపీ దూరమైతే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రంపై అవిశ్వాసమంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, అసెంబ్లీ, పార్లమెంట్ చట్టాలు తెలుసుకొని జగన్ మాట్లాడాలని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.