బాబు ఒప్పుకున్నారు...
ఎన్నో విపత్తులు చూశాను, కానీ ఇపుడొచ్చింది అతి పెద్ద విపత్తు
“ఎన్నో విపత్తులను చూశాను కానీ, 38 రోజులుగా ఇబ్బంది పెడుతున్న అతి పెద్ద సమస్య ఇదే,” అని ముఖ్యమంత్రి అంగీకరించారు. నోట్ల రద్దు తర్వాత రాష్ట్ర మంతా ప్రజలు పడుతున్న కష్టాలు చూశాక ఆయన చేసిన కామెంట్ ఇది.
రోజొకసారి ఆయన అధికారులతో, బ్యాంకాఫీసర్లతో నోట్ల నష్టాలను సమీక్షిస్తున్నారు. తాజా సమీక్షలో ఆయన చేసిన వ్యాఖ్య ఇది.
ఇవన్నీ వూహించకుండ అయిదొందలు, వేయి నోట్ల రద్దు చేయండని నోట మాటగా కాదు, రాతపూర్వకంగా ప్రధానికి సలహా ఇచ్చింది తానే నని మొదటి రెండురోజుల చంకలేసుకున్న సంగతి ఆయనకిపుడు గుర్తురానట్లుంది.
ఈ సమీక్షా సమావేశంలో పెన్షన్ దారుల కష్టాల మీద ఆయన సానుభూతి చూపారు.
ఎట్టిపరిస్థితుల్లో పెన్షన్ దారులకు నగదు రూపంలోనే చెల్లింపులు జరపాలి, రాష్ట్రానికి చేరిన రూ. 500 కోట్ల నగదులో రూ. 300 కోట్ల విలువైన రూ. 500 నోట్లు వచ్చాయని, వీటిని వేరే లావాదేవీలకు మళ్లించకుండా పింఛన్లకే కేటాయించాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి ‘ఆదేశాలు’ జారీ చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
రైతులు రబీ సీజన్లో ఇబ్బందిపడకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకింగ్ అధికారులపైనే వుంది. నెలాఖరు కల్లా నోట్ల రద్దుతో తలెత్తిన ఇబ్బందులకు పూర్తి పరిష్కారం చూపించాలని కూడా ఆయన అన్నారు.
అయితే, ఈ సమస్యకు డిజిటల్ లిటరసీ ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని మరొక వివదాస్పద ప్రకటన కూడా చేశారు. డిజిటల్ లిటరసీ ఒక్కో లావాదేవీకి రూ.35 ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు.
సాధ్యమైనంత త్వరగా 50 వేల ఎం-పాస్ మిషన్లను అందుబాటులోకి తేవాలని సూచన. బ్యాంకింగ్ కరెస్పాండెట్లు లేని చోట చౌక ధరల దుకాణాల ద్వారా సేవలు అందిచేలా చూడాలన్నారు.
ఆయన ఇలా అందరికీ ఆదేశాలు జారీచేస్తున్నా ఎక్కడ క్యూలు తగ్గినట్లు లేదు. తుపాన్ బాధితులను అదుకోవడం దిట్ట అని ఆయనకు పేరుంది. ఈ అనుభవంతో ఆయన ఒక సారి ఒరిస్సా తుఫాన్ బాధితులకు కూడా సహాయ మిచ్చాడు. మొన్నటికి మొన్నహుదుద్ లో ఏ మిచేశాడో చూశాం కదా. అలాంటి ముఖ్యమంత్రి కి కూడా నోట్ల విపత్తు లొంగి రావడం లేదు.