పదవుల కోసం తానెప్పుడూ ఆశించలేదన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు. పార్టీలో వున్న చిన్న చిన్న విభేదాలను పరిష్కరించడంపై దృష్టి పెడతానని ఆయన పేర్కొన్నారు. జనసైనికులు, వీరమహిళలను కలుస్తానని .. తనను కూడా ఎవరైనా కలవొచ్చని నాగబాబు చెప్పారు.
సినీనటుడు , తన సోదరుడు నాగబాబును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పవన్ కల్యాణ్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబు స్పందించారు. 2019 నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని.. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిని అయినప్పటికీ తాను సాధారణ కార్యకర్తగానే సేవ చేశానని అన్నారు. పదవుల కోసం తానెప్పుడూ ఆశించలేదని.. తనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు పవన్కు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా తనకు బాధ్యతలు పెరిగాయని.. దీనిని తాను పదవిలా భావించడం లేదని నాగబాబు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన విజయమే లక్ష్యంగా పనిచేస్తానని నాగబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీలో వున్న చిన్న చిన్న విభేదాలను పరిష్కరించడంపై దృష్టి పెడతానని ఆయన పేర్కొన్నారు. పవన్ సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్తానని చెప్పారు. ఈ క్రమంలో జనసైనికులు, వీరమహిళలను కలుస్తానని .. తనను కూడా ఎవరైనా కలవొచ్చని నాగబాబు పేర్కొన్నారు.
ALso Read: అన్నయ్యకు పార్టీలో ప్రాధాన్యత పెంచిన పవన్.. జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు
కాగా.. మరికొద్దినెలల్లో ఏపీ , తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన సోదరుడు, సినీనటుడు నాగబాబును నియమిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా నాగబాబు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో పాటు జనసేన ఎన్ఆర్ఐ విభాగం, అభిమానులను నాగబాబు సమన్వయ పరిచే బాధ్యత కూడా నాగబాబుకు అప్పగించారు పవన్. అలాగే నెల్లూరుకు చెందిన వేములపాటి అజయ్ కుమార్కి కూడా పవన్ కల్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ మీడియాకు జనసేన పార్టీ తరపున అధికార ప్రతినిధిగా సేవలు అందించడంతో పాటు రాజకీయ శిక్షణ తరగతులు, బూత్ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ బాధ్యతలను అజయ్ కుమార్కి అప్పగించినట్లుగా తెలుస్తోంది.
