శ్రమదానానికి పవన్ పిలుపు.. ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కొత్త రోడ్లు: వైసీపీపై నాదెండ్ల మనోహర్ ఫైర్
ఎట్టిపరిస్ధితుల్లోనూ కాటన్ బ్యారేజిపై శ్రమదానం చేసితీరుతామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మీరు చేయరు, మేం శ్రమదానం చేస్తామంటే చేయనివ్వరు అంటూ నాదెండ్ల మండిపడ్డారు.
ఏపీవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందంటూ గతకొన్ని రోజులుగా జనసేన పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. అలాగే ప్రతి ఏరియాలోని రోడ్ల దుస్థితిపై ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజిపై పవన్ కల్యాణ్ శ్రమదానం చేసేందుకు సిద్ధపడగా, ఇందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీనిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ కాటన్ బ్యారేజిపై శ్రమదానం చేసితీరుతామని స్పష్టం చేశారు. మీరు చేయరు, మేం శ్రమదానం చేస్తామంటే చేయనివ్వరు అంటూ నాదెండ్ల మండిపడ్డారు.
ఎవరు అడ్డుకున్నా వెనుకంజ వేసేది లేదని, శ్రమదానం విషయంలో ముందుకెళ్లి తీరుతామని మనోహర్ అన్నారు. పవన్ వెళ్లే ప్రాంతాల్లో ఇప్పుడు హడావిడిగా రోడ్లు వేస్తున్నారని నాదెండ్ల విమర్శించారు. ప్రజా సమస్యలపై స్పందించాలని తాము కోరితే, వ్యక్తిగత దూషణలెందుకుని ప్రశ్నించారు. ఇక, బద్వేలు ఉప ఎన్నిక అభ్యర్థిపై బీజేపీతో చర్చించిన పిదప నిర్ణయం తీసుకుంటామని చెప్పారు