పవన్ తో మారుతుంది: ప్రత్యేక రాయలసీమకు జైకొట్టనున్న మైసురా
పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారుతుందని మాజీ మంత్రి మైసురా రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాయలసీమ సాధనకు ఎవరు పోరాడినా తాను సంపూర్ణ మధ్ధతు ఇస్తానని అన్నారు.
ఖమ్మం: పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారుతుందని మాజీ మంత్రి మైసురా రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 23 శాతం ఉన్న కాపులు కడా అధికారం కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాల్వంచ వచ్చిన ఆయన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు.
గతంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలు మూడు మాత్రమే ఉండేవని, కొత్తగా మరో పార్టీ జనసేన ఉద్భవించిందని, దీంతో రాజకీయ ముఖచిత్రం మారుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరు పట్ల ప్రతిపక్షాలు దీటుగా స్పందించలేకపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కూడా తెలంగాణకు అన్యాయమే జరిగిందని అన్నారు. ప్రత్యేక రాయలసీమ సాధనకు ఎవరు పోరాడినా తాను సంపూర్ణ మధ్ధతు ఇస్తానని అన్నారు. అంతకు ముందు ఆయన పాల్వంచ పెద్దమ్మ తల్లిని, భద్రాచలం సీతారామచంద్రులను దర్శించుకున్నారు.