ప్రియుడితో కలిసి భర్త హత్య.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం.. కానీ చివరికి..
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఈ ఘటన ఏపీలోని అనకాపల్లిలో జరిగింది. పోలీసులు ఈ కేసును చేధించారు. నిందితులను అరెస్టు చేశారు.
ప్రియుడితో కలిసి ఓ మహిళ దారుణాకి పాల్పడింది. తన భర్తను దారుణంగా హతమార్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ ఘటనకు పాల్పడింది. అయితే దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ పోలీసుల దర్యాప్తులో అది ప్రమాదం కాదని, హత్యా అని తేలింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
నర్సీపట్నం ఏఎస్పీ అధిరాజ్సింగ్ రాణా తెలిపిన వివరాల ప్రకారం.. గొలుగొండ మండలం కొత్తమల్లంపేట గ్రామంలో 33 ఏళ్ల గుడివాడ అప్పలనాయుడు, 24 ఏళ్ల జానకి దంపతులు నివసిస్తున్నారు. అయితే జానకికి ఓ తాపిమేస్త్రిగా పని చేసే చింతల రాముతో కొంత కాలం కిందట పరిచయం ఏర్పడింది. అతడు పాతకృష్ణదేవిపేట చెందిన వ్యక్తి. అయితే వారి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
జానకీ, ఆ తాపిమేస్త్రితో తరచూ ఫోన్ లో మాట్లాడటాన్ని అప్పలనాయుడు గమనించాడు. ఆమెను మందలించి, పనికి వెళ్లనివ్వడం లేదు. ఇది భార్యకు కోపం తెప్పించింది. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని ఆమె భావించింది. అందుకే అతడిని అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. దీని కోసం ప్రియుడి కలిసి భర్తను హతమార్చడానికి ప్లాన్ వేసింది.
అందులో భాగంగానే ఈ నెల 20వ తేదీన అప్పలనాయుడుకు ఏదో ఒక కారణం చెప్పి పాములవాకలో ఉన్న పట్టాలమ్మ తల్లి ఆలయానికి తీసుకొని వెళ్లింది. తరువాత దంపతులు ఇద్దరు బైక్ పై స్వగ్రామానికి ప్రయాణం మొదలుపెట్టారు. అయితే తాండవ నది గట్టు దగ్గరికి చేరుకున్న తరువాత.. బహిర్బూమికి వెళ్లాలని అనిపిస్తోందని భర్తకు చెప్పింది. దీంతో అతడు బైక్ ఆపాడు. భర్తను కూడా రోడ్డుకు పక్కన ఉన్న జీడితోటలోకి తీసుకొని వెళ్లింది. కొంత సమయం తోటలోనే కూర్చుందామని భర్తను కోరింది. దానికి అతడు అంగీకరించాడు. ఈ క్రమంలో జానకీ తన భర్త ఒడిలో తలపెట్టుకొని పడుకుంది.
అయితే ప్లాన్ భాగంగా అక్కడే దాక్కొని ఉన్న తాపిమేస్త్రి రాము వెనక నుంచి అప్పలనాయుడు తలపై సుత్తితో బలంగా బాదాడు. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం జానకీ, రాము కలిసి రాళ్లతో కొట్టారు. దీంతో బాధితుడు చనిపోయాడు. అనంతరం డెడ్ బాడీని రోడ్డుపైకి తీసుకొని వచ్చారు. తరువాత రాము అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అటుగా వెళ్లే వారికి తన భర్త రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పింది. కానీ డెడ్ బాడీకి ఉన్న గాయాలు చూసి వారికి అనుమానం వచ్చింది. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్య అని నిర్ధారించారు. నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం రిమాండ కు తీసుకెళ్లారు.