ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి రాజీనామా చేశారు (MP Raghuramakrishna Raju resigned from the YSRCP). చాలా కాలంగా సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్న ఆయన ఎట్టకేలకు తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు లేఖ రాశారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన వైసీసీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దానిని తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఆ లేఖలో వైఎస్ జగన్ పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఆలయాల ఆదాయంలో 10 శాతం ఇవ్వాల్సిందే.. కర్ణాటక ప్రభుత్వ వివాదాస్పద బిల్లు.. కానీ..
‘‘పార్లమెంటరీ సభ్యత్వం నుంచి నన్ను అనర్హుడిగా ప్రకటించడానికి మీరు చేసిన అనేక ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వలేదు. మీరు ఇలా ప్రయత్నించిన ప్రతీ సారి, నర్సాపురంలో మూడున్నరేళ్లు సమగ్ర అభివృద్ధి చేయడానికి శక్తివంతంగా ప్రయత్నించాను. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. దానిని వెంటనే ఆమోదించాలని కోరుతున్నాను.’’ అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు అందరం ప్రజా తీర్పు కోరాల్సిన సమయం ఆసన్నమైందని రఘురామకృష్ణరాజు అన్నారు. కాగా.. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి లోక్ సభకు ఎన్నికైన ఆయన కొంత కాలానికే పార్టీకి దూరమయ్యారు. సొంత పార్టీపై, వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తూ రెబల్ ఎంపీగా మారారు. కానీ పార్టీకి రాజీనామా చేయకుండా దాదాపు తన పదవీ కాలాన్ని పూర్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
