మోదీకి రఘురామ కృష్ణం రాజు మరో లేఖ
పీఎం ఆవాస్ యోజన ద్వారా వలస కూలీలకు అండగా నిలిచారని కొనియాడారు. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన నవంబరు వరకు పొడిగించడం గురించి కూడా రఘురామ కృష్ణం రాజు ప్రస్తావించారు.
ప్రధాని నరేంద్రమోదీకి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరో లేఖ రాశారు. లాక్ డౌన్ సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని పొగుడుతూ లేఖ రాశారు. లాక్ డౌన్ కాలంలో 81 కోట్ల మంది పేద ప్రజల ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. అంతేకాక, పలు విషయాల్లోనూ ప్రధాని మోదీపై రఘురామ కృష్ణం రాజు ప్రశంసలు కురిపించారు.
వ్యవసాయ రంగానికి రూ.లక్ష కోట్లు కేటాయించడంపైనా ప్రధానికి రఘురామ కృష్ణం రాజు కృతజ్ఞతలు తెలిపారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా వలస కూలీలకు అండగా నిలిచారని కొనియాడారు. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన నవంబరు వరకు పొడిగించడం గురించి కూడా రఘురామ కృష్ణం రాజు ప్రస్తావించారు.
మరోవైపు, రఘురామ కృష్ణం రాజు ప్రవర్తనతో ఆయనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ప్రసాద్ రాజు ఫిర్యాదులు చేసినవారిలో ఉన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, నరసాపురంలో ప్రసాద్ రాజు కంప్లైంట్ ఇచ్చారు. బుధవారం గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు కూడా ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.