మురళీ మోహన్ సంచలన నిర్ణయం.. షాకయిన ఎంపీలు
మురళీమోహన్ తీసుకున్న సంచలన నిర్ణయానికి టీడీపీ ఎంపీలంతా ఒక్కసారిగా షాకయ్యారు.
టీడీపీ ఎంపీ మురళీమోహన్ తీసుకున్న సంచలన నిర్ణయానికి టీడీపీ ఎంపీలంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటా..? అనుకుంటున్నారా.. రాజకీయంగా కాదులేండి. భోజనం విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరం పాటు మాంసాహారం తిననని ఒట్టువేసుకున్నారట.
పూర్తి వివరాల్లోకి వెళితే... తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుల భేటీ ఈ మధ్యే జరిగింది. చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో ఈ సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకుల భేటీ ఎప్పుడు విజయవాడలో జరిగినా స్థానిక ఎంపీ కేశినేని నాని ఏదో ఒక పూట తన ఇంట్లో అందరికీ ఆతిథ్యం ఇస్తారు. ఉదయం బ్రేక్ ఫాస్టో, మధ్యాహ్నం లంచో లేక రాత్రికి డిన్నరో ఏర్పాటు చేస్తుంటారు. మొన్నటి మీటింగుని మధ్యాహ్నం మూడు గంటలకు ఏర్పాటుచేశారు. అంతకుముందే అంటే ఒంటిగంటకు తన ఇంట్లో లంచ్కు రావాలని సహచరులందరికీ నాని వర్తమానం పంపారు.
నాని కోరిక మేరకు ఎంపీలంతా ఆయన ఇంటికి చేరుకున్నారు. మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, సాంబార్ రైస్, పాయసం, ఐస్ క్రీం, పెరుగన్నం ఇంకా నోరూరించే పలు వంటకాలను సిద్ధంచేశారు. ఎంపీలంతా ఎక్కువ నాన్ వెజ్తో మొదలుపెట్టారు. కానీ రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ మాత్రం ప్లేట్ పట్టుకుని శాకాహార వంటకాల వైపు వెళ్లారు. మాంసాహారాన్ని ఎంతో ఇష్టంగా తినే ఆయన నాన్వెజ్ వైపు తొంగిచూడకపోవడం సహజంగానే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకరిద్దరు సన్నిహితులైతే "ఇందేంటి?'' అని వెంటనే అడిగేశారు కూడా! సినిమా మనిషి, అందులోనూ గోదావరి జిల్లావాసి మాంసాహారాన్ని తినకపోవడమేంటి అన్నదే అందరిలో నెలకొన్న సందేహం! అప్పుడు అసలు విషయం చెప్పడం మొదలుపెట్టారు మురళీమోహన్.
ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా! నాటినుంచి అంటే ఈ నెల రెండో తేదీనుంచి ఏడాదిపాటు మాంసాహారం ముట్టుకోనని ఆయన స్వీయ ప్రతినబూనారట. అవసరమైతే ఆ తర్వాత కూడా మానేసే ఆలోచనలో ఉన్నారట. ఆ సమయంలో పక్కనే ఉన్న అనంతపురం ఎంపీ జె.సి.దివాకర్రెడ్డి మా రాయలసీమలో అవన్నీ కుదరదయ్యా అంటూ ఇష్టమైన మటన్ బిర్యానీ వడ్డించేసుకున్నారు.
మహాత్మాగాంధీ జీవహింస కూడదన్నారు. మధ్యపానం వద్దన్నారు. అలాంటి మహనీయుడి 150 జయంత్యుత్సవాల సందర్భంగా ఏడాదిపాటు నాన్వెజ్ ముట్టుకోవద్దని నిర్ణయంచుకున్నానని మురళీమోహన్ చెప్పారు. దీంతో ఎంపీలంతా "అంత నిగ్రహంగా మీరు నిర్ణయం తీసుకుంటే మేం కాదనం'' అంటూ మెచ్చుకున్నారు.