ఏపీకి మీరేం చేశారో చూపించగలరా? టిడిపి, వైసిపిలకు జివిఎల్ సవాల్
కేంద్ర నిధుల సహకారంతోనే ఏపీ అభివృద్ది జరుగుతోందని... రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదన్నారు బిజెపి ఎంపీ జివిఎల్.
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ది ప్రధాని మోడీ లక్ష్య సాధనతోనే జరుగుతోందని బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర నిధుల సహకారంతోనే ఏపీ అభివృద్ది జరుగుతోందని... రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదన్నారు. ఏపీలో రాజకీయాలు వ్యాపారం అయిపోయాయని... ఎన్నికలు పూర్తిగా దనమయం చేసేశారని జివిఎల్ ఆరోపించారు.
దనమయమైన రాజకీయాల నుంచి విముక్తి కలిగించడానికి ప్రజలే పూనుకోవాలని... దీనికి పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో బిజెపి ఒక్క సీటు గెలవక పోయినా అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కానీ టిడిపి, వైసీపీ లు బిజెపి పట్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఏపిలో బిజెపి చేసిన అభివృద్ది తప్ప, మీరు ఏమి చేసారో చూపించగలరా? అంటూ టిడిపి, వైసీపీ లకు జివిఎల్ సవాల్ విసిరారు. కేంద్రం, విశాఖ నగరానికి చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ఒక కరపత్రిక విడుదల చేశారు. ఈనెల 8వరకు విశాఖలో పర్యటించి బిజెపి, జనసేన కూటమిని గెలిపించాలని అభ్యర్థిస్తామని జివిఎల్ వెల్లడించారు.