భారతీయ జనతాపార్టీపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మళ్లీ విరుచుకుపడ్డారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమరావతి: భారతీయ జనతాపార్టీపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మళ్లీ విరుచుకుపడ్డారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ మోసం చేస్తే, విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ ద్రోహం చేసిందని ఆరోపించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎన్ని విధాలుగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేదిలేదని స్పష్టం చేశారు. కేంద్రం దిగి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్న జయదేవ్ విద్యార్థులు తమ పోరాటానికి మద్దతు పలకాలని కోరారు.

వేసవి పార్లమెంట్ సమావేశాల్లో గల్లా జయదేవ్ పార్లమెంట్ లో బీజేపీని కడిగిపారేశారు. బీజేపీ కూడా కాంగ్రెస్‌లాగే స్వప్రయోజనాల కోసం ప్రయత్నిస్తే.. ఏపీ ప్రజలేం అమాయకులు కాదని జయదేవ్ హెచ్చరించారు. మీరిచ్చిన నిధులకంటే బాహుబలి కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయని ప్రజలు జోక్‌లు వేసుకుంటున్నారు అని ఎంపీ వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి వెంటనే ప్రకటన చేయాలని జయదేవ్ డిమాండ్ చేశారు.

 లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలోనూ ఎంపీ గల్లా జయదేవ్ ఏపీ సమస్యలపై గొంతెత్తారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ఏపీకి అన్యాయం చేశాయని తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం చేయాల్సినంత సాయం చేసి ఉంటే ఏపీ మరోలా ఉండేదన్నారు. 

ఉమ్మడి ఏపీకి ఆదాయ వనరుగా హైదరాబాద్‌ ఉండేదని, హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్లిపోవడంతో ఏపీ ఆదాయం లేని రాష్ట్రంగా మిగిలిందన్నారు. విభజనతో 90 శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు. ఏపీ అభివృద్ధి రేటు 13 శాతం ఉన్నా తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిందని గల్లా లోక్ సభలో గళమెత్తారు.