‘‘జీలకర్రలో కర్ర లేదు.. పవన్ కళ్యాణ్ లో..’’
పవన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ సీఎం రమేశ్
టీడీపీ నేత, ఎంపీ సీఎం రమేష్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా కడప మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రాగానే జనసేన అధినేత పవన్కళ్యాణ్ పచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నారని రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.
జీలకర్రలో కర్రలేనట్లుగా పిచ్చి ప్రేలాపణలు చేశారన్నారు. ఆయన పేరులో ఉన్న కళ్యాణ్ ఉంటే నిత్య పెళ్ళి కుమారుడని ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీ, జనసేనలోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని రానున్న ఎన్నికల్లో ప్రజల ఆగ్రహం ముందు మసి కాక తప్పదని తెలిపారు.
అనంతరం మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అప్పుడు హేతుబద్ధత లేకుండా విభజన చేసి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని, ఇప్పుడేమో రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షిగా హామీ ఇచ్చిన బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిజాయితీపాలన అందించే చంద్రబాబుకు మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడని, 11 కేసుల ఆర్థిక నేరగాడు జగన్ను బెడ్ రూంలో కూర్చోబెట్టుకుని మాట్లాడడం వెనుక ఉన్న చీకటి ఒప్పందం బహిర్గతమైందన్నారు.