ఆడపిల్ల పుట్టిందని 5 రోజుల శిశువును చంపేసిన తల్లి.. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు
మళ్లీ ఆడపిల్లే పుట్టిందనే నెపంతో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. గొంతులో ఏదో వేసి ఊపిరిఆడకుండా చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందని కన్నతల్లే 5 రోజుల శిశువును చంపేసింది. ఈ అమానవీయ ఘటన తాడికొండ మండలం రావేలలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట సుబ్బయ్య లక్ష్మి దంపతులకు 16 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమర్తెలు ఉన్నారు. ఈ నెల 2వ తేదీన లక్ష్మీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. మళ్లీ ఆడపిల్లే పుట్టిందనే కారణంతో 7వ తేదీన ఆ చిన్నారి గొంతులో ఏదో వేసి ఊపిరి ఆడకుండా చేసి చనిపోయేలా చేసింది. పాపను చూసి వద్దామని వెళ్లిన స్థానిక ఆశవర్కర్ కు పాప చనిపోయిందనే సమాధానం వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన ఆశ కార్యకర్త ఈ నెల 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందే ఆ శిశువును భర్త వెంకట సుబ్బయ్య, అతడి మామ లక్ష్మయ్య వారి పొలంలో పాతి పెట్టారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు శుక్రవారం ఘటనా స్థలానికి వెళ్లి శిశువు మృతదేహాన్ని తవ్వి తీశారు. ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేశామని, వారిని అరెస్టు చేసి మిగితా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.