రుతుపవనాల మందగమనం... తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి ఇదీ: వాతావరణ శాఖ
నేడు (బుధవారం) కోస్తాంధ్రతో పాటు తెలంగాణల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.
అమరావతి: అనుకూల పరిస్థితులు లేక నైరుతి రుతుపవనాలు రాజస్తాన్, యూపి, దిల్లీ, చండీగర్లలోకి ప్రవేశించటం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పశ్చిమ రాజస్తాన్ సహా ఆయా ప్రాంతాల్లో వేడిగాలులు కొనసాగుతున్నాయని... అటునుంచి వీచే గాలులతో తెలుగు రాష్ట్రాలలోనూ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. మరో అయిదురోజులు పరిస్థితి ఇలానే వుండనుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
అయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలు ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. నేడు (బుధవారం) కోస్తాంధ్రతో పాటు తెలంగాణల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.
రేపు(గురువారం) కోస్తాంధ్ర, యానాం, తెలంగాణల్లో చెదురుమదురుగా జల్లులు పడతాయని... రాయలసీమ సహా కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపారు. జులై 2(శుక్రవారం)న కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములతో కూడిన జల్లులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.