విజయసాయిరెడ్డిపై మోడీ చర్యలు తీసుకోవాలి.. మాణిక్యం ఠాగూర్ ట్వీట్
విజయసాయి రెడ్డి మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు వదిలేశారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఢిల్లీ : ఏపీ ల్యాండ్ స్కాం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు. అవినీతికి పాల్పడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కోవాలని అన్నారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. విజయసారి రెడ్డి వ్యాపారానికి అంతర్గతంగా సహకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. విజయసాయి తన ఇంటర్వ్యూలో అన్ని వివరాలు ఇచ్చారని, చదివి ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీఎం జగన్కు, విజయసాయిరెడ్డికి మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం గత కొంతకాలంగా కొనసాగుతుంది. విజయసాయి రెడ్డిని వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడంతో ఈ ప్రచారం తెరపైకి వచ్చింది. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి భూదందాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపణల నేపథ్యంలో జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పటి నుంచి వైసీసీలో విజయసాయి రెడ్డి వ్యవహారంలో ఏదో జరుగుతుందనే ప్రచారం మరింత ఊపు అందుకుంది.
సొంత పార్టీ నేతలను, సాక్షి మీడియాను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి.. వైసీపీలో అలజడి..!
అయితే ఈ ప్రచారాన్ని విజయసాయి రెడ్డి చాలా సందర్భాల్లో ఖండించారు. కానీ, కొన్నిసార్లు సొంత పార్టీ నేతలనే ఇరకాటంలో పెట్టేలా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కూర్మన్నపాలెం హయగ్రీవ వెంచర్లో భూయజమానికి ఒక శాతం ఇచ్చి.. ప్రాజెక్టు డెవలపర్ 99 శాతం తీసుకున్నారని.. ప్రపంచంలో ఎక్కడాలేనిది ఇక్కడే చూస్తున్నానని అన్నారు. ఇలాంటి ఒప్పందాలను మీడియా ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. అయితే ఈ ప్రాజెక్టులో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రధాన భాగస్వామి కావడం గమనార్హం.
దసపల్లా వ్యవహారంలో తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడానికి.. కూర్మన్నపాలెంలో ప్రాజెక్టు పేరును విజయసాయిరెడ్డి ఇలా వాడుకున్నారా? లేక కావాలనే ఎంవీవీ సత్యనారాయణను లక్ష్యంగా చేసుకుని ఈ విధమై కామెంట్స్ చేశారా? అనేది వైసీపీ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తన గురించి పార్టీలోని వ్యక్తులే మీడియాకు సమాచారం ఇస్తున్నట్లు కొందరు చెప్పారని.. ఆధారాలుంటే వారిపై పార్టీపరంగా చర్య తీసుకుంటామని విజయసాయిరెడ్డి చెప్పడం వైసీపీ నాయకుల మధ్య అంతర్గత విబేధాలు కొనసాగుతున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్పై ఎంవీవీ సత్యనారాయణ కూడా ఘాటుగా స్పందించారు. విజయసాయి రెడ్డి ప్రతిదీ ప్రకటించారని.. కేవలం కొత్త రాజకీయ పార్టీ ప్రకటించే సమయంలో ఆగిపోయాడని విమర్శలు సంధించారు.