Andhra Pradesh Election 2024 : జగన్ పార్టీకి ఝలక్ ... ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య రాజీనామా
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య అధికార పార్టీకి షాకిచ్చారు. పాార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటనతో ఒక్కసారిగా వైసిపిలో అలజడి రేగింది.
![MLC C Ramachandraiah Resign to YSRCP AKP MLC C Ramachandraiah Resign to YSRCP AKP](https://static-ai.asianetnews.com/images/01dbcmyhq68871pqea1tnahw3t/c-rama_363x203xt.gif)
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు ముందు రాజకీయా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసిపితో పాటు ప్రతిపక్ష టిడిపి లోనూ రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసిపి ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య అధికార పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా లేఖను పంపించారు రామచంద్రయ్య.
వైసిపి అప్రజాస్వామిక విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు రామచంద్రయ్య పేర్కొన్నారు. కాబట్టి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసానని... వెంటనే ఆమోదించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు రామచంద్రయ్య తెలిపారు.
వైసిపి సభ్యత్వానికి రాజీనామా చేసాక ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగడం భావ్యం కాదు... అందువల్లే మరో మూడేళ్ల పదవికాలం వున్నా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సి. రామచంద్రయ్య తెలిపారు. శాసనమండలి ఛైర్మన్ ను కలిసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. తన సన్నిహితులు, అనుచరులతో సంప్రదించి భవిష్యత్ రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటానని... ఏ పార్టీలో చేరేది అప్పుడే ప్రకటిస్తానని సి.రామచంద్రయ్య తెలిపారు.
Also Read కేశినేని శ్వేత రాజీనామా ... ఆల్ ది బెస్ట్ చెప్పిన టిడిపి ఎమ్మెల్యే
గత రెండేళ్ళుగా వైసిపి అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో వున్నానని... కానీ ఏనాడూ పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించలేదని రామచంద్రయ్య అన్నారు. అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనే తనలాంటి పెద్దలను పట్టించుకునేవారే లేకుండా పోయారన్నారు. పాలనలో అనుభవం కలిగిన సీనియర్ల సలహాలు తీసుకునే అలవాటే వైసిపిలో లేదన్నారు. ఇన్నిరోజులు పరిస్థితి మారుతుందని ఓపికపట్టాను...కానీ మళ్లీ ఎన్నికలే వచ్చాయి కాని వైసిపి తీరు మారలేదన్నారు. అందువల్లే ఇక ఈ అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే వైసిపిని వీడుతున్నట్లు రామచంద్రయ్య తెలిపారు.
వైసిపిలో అసలు రాజకీయ విలువలే లేవని ... అలాంటి పార్టీలో తనలాంటివారు ఇమడలేరని రామచంద్రయ్య అన్నారు. కాబట్టి ఏమాత్రం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనుకునేవారు వైసిపిలో వుండరని అన్నారు. తనలాంటి సీనియర్లకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసే అవకాశం వుండదని అన్నారు. ప్రాధాన్యత లేని పార్టీలో ఇక కొనసాగలేకే రాజీనామా చేసినట్లు రామచంద్రయ్య తెలిపారు.