కేశినేని శ్వేత రాజీనామా ... ఆల్ ది బెస్ట్ చెప్పిన టిడిపి ఎమ్మెల్యే
విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు, టిడిపి కార్పోరేటర్ శ్వేత రాజీనామాకు ముందు ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమె ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో భేటీ అయి ఎన్టీఆర్ విగ్రహానికి నివాాళి అర్పించి రాజీనామా చేసేందుకు బయలుదేరారు.
![Kesineni Nani Daughter Swetha resign Vijayawada Corporator post AKP Kesineni Nani Daughter Swetha resign Vijayawada Corporator post AKP](https://static-ai.asianetnews.com/images/01hkkzgjr788am9kn91h58xydt/screenshot--229--png_363x203xt.jpg)
విజయవాడ : విజయవాడ ఎంపీ కూతురు, టిడిపి కార్పోరేటర్ కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేసారు. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో మేయర్ భాగ్యలక్ష్మికి తన రాజీనామా లేఖను అందజేసారు శ్వేత. వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేస్తున్నానని... వెంటనే ఆమోదించాలని మేయర్ ను కోరారు కేశినేని శ్వేత.
విఎంసి కార్యాలయానికి వెళ్లేముందు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను కలిసారు శ్వేత. గతంలో తమకు మద్దతుగా నిలిచి కార్పోరేటర్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు రాజీనామా విషయం తెలియజేయాలనే కలిసానట్లు శ్వేత తెలిపారు. తనకు భీపామ్ ఇచ్చి గెలుపుకు కృషిచేసిన ఎమ్మెల్యే గద్దెకు కృతజ్ఞతలు తెలిపానని అన్నారు. గద్దె కుటుంబం తమకు ఫ్యామిలీ స్నేహం కూడా వుందని శ్వేత తెలిపారు. తన రాజీనామాకు గల కారణాలను ఎమ్మెల్యేకు వివరించానని ఆమె వెల్లడించారు.
ఇక శ్వేతతో భేటీపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా స్పందించారు. రాజీనామాకు ముందు మర్యాదపూర్వకంగానే కలిసేందుకు ఆమె తనవద్దకు వచ్చిందన్నారు. కార్పోరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పిందన్నారు. ఇది ఆమోదం పొందినతర్వాత పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు శ్వేత చెప్పిందన్నారు. తాను ఆల్ ది బెస్ట్ చెప్పి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించానని అన్నారు. శ్వేతను కలిసిన విషయంపై అదిష్టానం సంప్రదిస్తే జరిగింది చెబుతానని ఎమ్మెల్యే రామ్మోహన్ తెలిపారు.
వీడియో
ఇక రాజీనామా పత్రాన్నిమేయర్ కు అందించేందుకు బయలుదేరే ముందు టిడిపి వ్యవస్థాపకులు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి శ్వేత నివాళి అర్పించారు. విగ్రహానికి పూలమాల వేసి దండం పెట్టుకుని బయలుదేరారు. ఇలా కేశినేని భవన్ నుండి రాజీనామా లేఖతో విఎంసి కార్యాలయానికి వెళ్లిన శ్వేత మేయర్ భాగ్యలక్ష్మిని కలిసారు. తన రాజీనామా పత్రాన్ని ఆమెకు అందించి తొందరగా ఆమోదించాల్సిందిగా కేశినేని శ్వేత కోరారు.
Also Read తండ్రి కేశినేని నాని బాటలోనే కూతురు శ్వేత ... టిడిపికి రాజీనామా
ఇక టిడిపిలో తనకంటే సోదరుడు కేశినేని చిన్నికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఎంపీ నాని ఏమాత్రం సహించలేకపోయాడు. తాజాగా చంద్రబాబు 'రా... కదలిరా' సభ ఇంచార్జీ బాధ్యతలు కూడా చిన్నికి అప్పగించింది టిడిపి. అలాగే ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ మరొకరికి ఇవ్వనున్నట్లు నానికి సమాచారం ఇచ్చారు. దీంతో టిడిపికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు కేశినేని నాని. ముందుగా ఎంపీ పదవికి ఆ తర్వాత టిడిపి రాజీనామా చేయనున్నట్లు నాని ప్రకటించారు. కానీ అంతకంటే ముందే ఆయన కూతురు శ్వేత రాజీనామా చేసారు.