ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయంలో  వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ దేశంలోనే  టాప్ లో నిలిచారు


అమరావతి: ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ దేశంలోనే టాప్ లో నిలిచారు. అత్యధిక వ్యక్తిగత ఆదాయం ఉన్న ఎమ్మెల్యేల జాబితాలో దేశంలోనే జగన్ ఐదవస్థానంలో నిలిచారు.ఈ మేరకు ఏడీఆర్ ఇచ్చిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయం, వృత్తిపై ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) నివేదిక విడుదల చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లలో ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరాల ప్రకారంగా ఈ నివేదిను తయారు చేసినట్టు ఏడీఆర్ స్పష్టం చేసింది.

దేశంలోని సుమారు 4,086 సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 3,145 మంది వార్షిక ఆదాయ వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. ఎమ్మెల్యేల వార్షిక ఆదాయ వివరాలను వెల్లడించని 941 మంది వివరాలను వెల్లడించలేదు.

కడప జిల్లా పులివెందుల నుండి జగన్ వార్షిక వ్యక్తిగత ఆదాయం రూ.13.92 కోట్లు ఉందని ఏడీఆర్ తెలిపింది. జగన్ తో పాటు ఆయన సతీమణి, ఇతర కుటుంబసభ్యుల ఆదాయంతో కలుపుకొని రూ. 18.13 కోట్లుగా ప్రకటించింది.

అత్యధిక ఆదాయం కలిగిన టాప్‌-20 ఎమ్మెల్యేల్లో నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి పేరు కూడా ఉంది. ఆయనకు 14వ, స్థానం దక్కింది. ఆయన వ్యక్తిగత ఆదాయం రూ.6.48 కోట్లు, కుటుంబ సభ్యుల ఆదాయాన్ని కలుపుకొని రూ.7.96 కోట్ల వార్షిక ఆదాయం ఉంటుందని ఏడీఆర్‌ సంస్థ తేల్చింది. 

కాంగ్రె్‌సకు చెందిన కర్ణాటకలోని హోసకోటె ఎమ్మెల్యే ఎన్‌.నాగరాజు రూ.157 కోట్ల ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర మలబార్‌హిల్స్‌ బీజేపీ ఎమ్మెల్యే మంగళ్‌ ప్రభాత్‌ లోధా (రూ.34.66 కోట్లు), కర్ణాటక ఆర్కేపురా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బసవరాజ (రూ.27.77 కోట్లు), తమిళనాడు నంగునేరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హెచ్‌.వసంతకుమార్‌ (రూ.22.65 కోట్లు) ఉన్నారు. వీరి తర్వాతి స్థానం జగన్‌దే. 

కాగా.. దేశంలోనే అత్యల్ప వార్షిక ఆదాయం కలిగిన ఎమ్మెల్యే తెలుగు దేశం పార్టీకి చెందిన శింగనమల ఎమ్మెల్యే యామినీబాల అని ఏడీఆర్‌ వెల్లడించింది. ఆమె వార్షిక వ్యక్తిగత ఆదాయం కేవలం రూ.1301 మాత్రమే! అలాగే వైసీసీకి చెందిన నూజివీడు ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్‌ అప్పారావు వ్యక్తిగత ఆదాయం రూ.60 వేలని తెలిపింది.

 దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల సగటు ఆదాయం రూ.24.59 లక్షలుగా ఉందని ఈ నివేదిక తెలిపింది. కర్ణాటక ఎమ్మెల్యేల సగటు అత్యధికం. వారి ఆర్జన రూ.1.1. కోట్లు.
 ఛత్తీస్‌ఘడ్ ఎమ్మెల్యేల సగటు రూ.5.4 లక్షలే. తమ వృత్తిని వ్యాపారం లేదా వ్యవసాయంగా పేర్కొన్నవారి సంఖ్య 397. వీరి సగటు వార్షిక వేతనం రూ.57.81 లక్షలు.