నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గురువారం హైడ్రామా నడిచింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బస్టాండ్ సెంటర్‌లో కూర్చొని తన వ్యతిరేక వర్గానికి సవాల్ విసిరారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. 

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్థానిక బస్టాండ్ సెంటర్‌లో కుర్చీ వేసుకుని కూర్చొన్నారు. గతంలో ఉదయగిరి వస్తే తరిమి కొడతామని ఆయన వ్యతిరేక వర్గం హెచ్చరించింది. దీంతో మేకపాటి బస్టాండ్ సెంటర్‌కు వచ్చారు. అంతేకాకుండా తనను తరిమికొడతానన్న వారు రావాలంటూ సవాల్ విసిరారు. అంతేకాకుండా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎవరు పడితే వారు నాయకులు కారని .. ఉదయగిరి తనదేనని, తామే అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేత మూలే వినయ్ రెడ్డి వర్గీయులు బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. అనంతరం మేకపాటికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తాము వచ్చే సరికి మేకపాటి వెళ్లిపోయారని, ఆయన అవినీతి ఎమ్మెల్యే, పార్టీ ద్రోహి అని వారు నినాదాలు చేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన వద్ద డబ్బులు తీసుకున్నది నిజం కాదా అని మూలే వినయ్ రెడ్డి ప్రశ్నించారు. ఈ పరిణామాలతో పట్టణంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. 

ALso REad: నమస్కారం కూడా చేయడు, 50 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి.. ఇంకెక్కడ వైనాట్ 175 : జగన్‌పై మేకపాటి వ్యాఖ్యలు

కాగా.. ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి టీడీపీ అభ్యర్ధికి ఓటు వేశారంటూ వైసీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి మేకపాటి పార్టీపై నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. అటు మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానని... ఒకవేళ గెలవకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. నువ్వు గెలవకుంటే రాకీయాల నుండి తప్పుకుంటావా? సిద్దమేనా అంటూ సవాల్ విసిరారు. నేనొక్కడినే కాదు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గెలవడంం ఖాయమని... ఇతరుల గురించి కాకుండా నీ గురించి ఆలోచించుకో అని సవాల్ విసిరారు. సింగిల్ డిజిట్ తో గెలిచిన అనిల్ 35 వేలమెజార్టీతో గెలిచిన నా గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మేకపాటి అన్నారు. 

అంతకుముందు గత శనివారం మేకపాటి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఎమ్మెల్యేలకు సరైన గుర్తింపు నివ్వడం లేదని, సీనియర్లను కనీసం గౌరవించరంటూ వ్యాఖ్యానించారు. నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా చేయరని మేకపాటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో పాటు ఆయన పక్కనున్నవాళ్లు కూడా నమస్కారం పెట్టరని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైఎస్ వద్ద వుండే గౌరవ మర్యాదలు జగన్ వద్ద లేవని చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also REad: మళ్లీ గెలిచి చూపిస్తా... లేదంటే రాజకీయాలే వదిలేస్తా..: మేకపాటి సవాల్

ఎమ్మెల్యేలను గౌరవించని పార్టీలు మూసుకోవాల్సిందేనంటూ మేకపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనన్నారని.. ఎమ్మెల్సీ ఇస్తామన్నారని, అయితే అది తనకు వద్దని జగన్‌కే చెప్పానని మేకపాటి తెలిపారు. సలహాదారుల్ని ఎమ్మెల్యేలపై పెట్టడం ఏంటన్న ఆయన.. వైసీపీలో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్నారని బాంబు పేల్చారు. అన్ని తెలుసుకోకుండా వైనాట్ 175 అని ఎలా అంటారని మేకపాటి ప్రశ్నించారు. బటన్లను నొక్కి అంతా బాగుందని అనుకుంటున్నారని, ఉద్యోగులకు జీతాలివ్వకపోవడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.