ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా పాజిటివ్
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ విళయతాండవం చేస్తోంది. సామాన్యులు మొదలు విఐపీలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవ్వరినీ వదలడం లేదు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ విళయతాండవం చేస్తోంది. సామాన్యులు మొదలు విఐపీలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవ్వరినీ వదలడం లేదు. ఇలా ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఈ వైరస్ బారిన పడ్డారు.
కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఎమ్మెల్యే బలరాం పరీక్ష చేయించుకున్నారు. ఇందులో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో చికిత్స కోసం ఆయన హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో చేరారు. ఆయన కుటుటుంబసభ్యులకు కూడా వైద్యాధికారులు కరోనా పరీక్షలు చేయించారు.
ఎమ్మెల్యే బలరాంకు కరోనా నిర్దారణ కావడంతో చీరాలలో అలజడి మొదలయ్యింది. ఇటీవల ఆయన నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆయనతో కలిసి కార్యక్రమాల్లో నాయకులు, ప్రజల్లో భయాందోళన మొదలయ్యింది.
read more ఏపీ మంత్రి బాలినేనికి కరోనా పాజిటివ్: హైదరాబాదు అపోలోలో చికిత్స
ఇదిలావుంటే, మంగళవారంనాడు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.... ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 76 వేల 333కి చేరాయి. రాష్ట్రంలో వైరస్ కారణంగా 67 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,604కి చేరుకున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 79,104 యాక్టివ్ కేసులు ఉండగా.. 95,625 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 6,953 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 64,147 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.వీటితో ఇప్పటి వరకు 21 లక్షల 75 వేల 70 మందికి పరీక్షలు నిర్వహించినట్లయ్యింది.
మంగళవారంనాటి కేసులతో కలిపి పాజిటివ్ కేసుల్లో దేశంలో మూడో స్థానానికి చేరుకుంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత ఏపీలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మంగళవారంనాడు అనంతపురం జిల్లాలో అత్యథికంగా 1,325 మందికి పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత తూర్పు గోదావరి 1,371, కర్నూలు 1,016, చిత్తూరు 26, గుంటూరు 940, కడప 765, కృష్ణ 420, నెల్లూరు 557, ప్రకాశం 224, శ్రీకాకుళం 537, విశాఖపట్నం 863, విజయనగరం 591, పశ్చిమ గోదావరిలలో 612 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు కోవిడ్ వల్ల గుంటూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కృష్ణ 9, కర్నూలు 8, చిత్తూరు 7, తూర్పుగోదావరి 7, నెల్లూరు 7, అనంతపురం 6, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 2, ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.