ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంట్లో విషాదం.. సీఎం సానుభూతి
ఖాన్ కుమారుడు మోసిన్ఖాన్ (27) గుండె పోటుతో గురువారం మరణించాడు.
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జలీల్ఖాన్ సోదరుడు షబ్బీర్ అహ్మద్ ఖాన్ కుమారుడు మోసిన్ఖాన్ (27) గుండె పోటుతో గురువారం మరణించాడు. మోసిన్ఖాన్ ఆటోనగర్లో ఐరన్ వ్యాపారం చేస్తున్నాడు. గురువారం ఉదయం వ్యాపారం నిమిత్తం ఆటోనగర్ వెళ్లాడు. అయితే గుండెలోనొప్పిగా ఉందని ఒక్కడే సూర్యారావుపేటలోని ఓ ప్రైవేటు హాస్పటల్కు వెళ్లి, తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశాడు. గుండెపోటు అధికంగా రావడంతో చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జలీల్ఖాన్, కుటుంబ సభ్యులు ప్రైవేటు హాస్పటల్కు వెళ్లి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మోసిన్ఖాన్ మృతదేహాన్ని పాతబస్తీ తారాపేటలోని ఎమ్మెల్యే నివాసానికి తరలించారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), తెలుగు యువత రాష్ట్ర నాయకుడు దేవినేని అవినాష్, వైసీపీ నాయకులు షేక్ ఆసిఫ్, ఎం.ఎస్.బేగ్, పోతిన వెంకట వరప్రసాద్, టీడీపీ కార్పొరేటర్లు, ఇతర పార్టీల నాయకులు వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి పూలదండలు వేసి నివాళులర్పించారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుడుకి భార్య, కుమార్తె (ఆరు నెలలు) ఉన్నారు.
మోసిన్ ఖాన్ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. గుండె పోటుతో మోసిన్ఖాన్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జలీల్ఖాన్ సోదరుడు షబ్బీర్ అహ్మద్ ఖాన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.