రాజధానిగా అమరావతిని వైఎస్ జగన్ సమర్ధించలేదు.. భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రాజధాని కావాలని వైఎస్ జగన్ సమర్ధించలేదని చెప్పారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రాజధాని కావాలని వైఎస్ జగన్ సమర్ధించలేదని చెప్పారు. మూడు రాజధానుల నినాదానికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన చేపట్టింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాయలసీమ జిల్లాల నుంచి తరలివచ్చిన జనం పాల్గొన్నారు. కృష్ణాపురం, గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా ఈ ర్యాలీ సాగింది. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద బహిరంగ సభలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు.
‘‘వైఎస్ జగన్ ఆ రోజున అమరావతిని సమర్ధించలేదా? అని చంద్రబాబు నాయుడు అంటున్నాడని.. నూటికి నూరు శాతం అమరావతిలో రాజధాని కావాలని జగన్ సమర్ధించలేదు’’ అని భూమన అన్నారు. ఆ రోజు ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన చేసిన సమయంలో వైఎస్ జగన్కు ఆహ్వానం ఇస్తే.. ఆయన వెళ్లనని చెప్పారని అన్నారు. ఆ ప్రారంభోత్సవానికి, శంకుస్థాపనకు అంగీకరించనని జగన్ చాలా స్పష్టంగా చెప్పారని తెలిపారు. చరిత్రలోని ఈ విషయాన్ని ప్రజలు మర్చి పోరని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాలకు కట్టుబడి ఉంటానని జగన్ శాసనసభ సాక్షిగా చెప్పారని అన్నారు.
Also Read: తిరుపతిలో రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన.. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ భారీ ర్యాలీ..
ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టడం సరైదని.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ల్యాండ్ పూలింగ్కు తాము వ్యతిరేకమని జగన్ శాసనసభ సాక్షిగా చెప్పారని అన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తాము ల్యాండ్ పూలింగ్ ద్వారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహన్ని పలు సందర్భాల్లో ప్రస్తావించామని చెప్పారు. చంద్రబాబు నాయుడు తిరుపతికి ద్రోహం చేశాడని విమర్శించారు. పద్మావతి మెడికల్ కాలేజ్లో రాయలసీమ వాసులకు అవకాశం లేకుండా 25 జీవోలు తీసుకొచ్చారని విమర్శించారు. శ్రీ సిటీ
రాయలసీమకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రాయలసీమకు ద్రోహం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. సీమ ప్రజల ఆవేదన ఏ స్థాయిలో ఉందో ఈ ర్యాలీ ద్వారా తెలిసిందన్నారు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ది అన్నారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చే సత్తా సీఎం జగన్కే ఉందన్నారు. కర్నూలులో హైకోర్టు పెడితే రాయలసీమలోని 8 జిల్లాల ప్రజల ఆత్మగౌరవం నిలబడుతుందన్నారు. రాయలసీమకు శ్రీ సిటీ తెచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. పిలనిచ్చిన మామకు, గద్దెనెక్కించిన రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.