చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్ కలకలం.. కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు..
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. 8 ఏళ్ల బాలుడు రాజీవ్ సాయిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కిడ్నాప్ కలకలం రేపింది. 8 ఏళ్ల బాలుడు రాజీవ్ సాయిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాప్కు గురైన బాలుడు క్షేమంగా బయటపడటంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. రాజీవ్ సాయి కుటుంబం చెన్నైలో నివాసం ఉంటుంది. దసరా పండుగ కోసం రాజీవ్ సాయి కుటుంబం చిలకలూరిపేట వచ్చింది. చిలకలూరిపేటలోని ఓ దేవాలయంలో రాజీవ్ సాయి తల్లిదండ్రులు పూజలు చేస్తుండగా.. అక్కడే ఆడుకుంటున్న బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు.
అనంతరం బాలుడి తండ్రికి ఫోన్ చేసిన దుండగులు.. కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. 50 లక్షలు ఇచ్చిన బాలుడిని వదిలిపెట్టమని హెచ్చరించారు. బాలుడి తల్లిదండ్రులు.. ఓ వైపు కిడ్నాపర్స్తో సంప్రదింపులు జరుపుతూనే, మరోవైపు ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
అయితే నెల్లూరు జిల్లా కావలి వద్ద బాలుడిని దుండగులు కారులో వదిలివెళ్లారు. అక్కడి నుంచి రాజీవ్ను అతడి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. రాజీవ్ సాయి క్షేమంగా దొరకడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.