ఇక్కడ కాదు.. ధైర్యం ఉంటే దిల్లీలో చేయండి బంద్... యనమల
విభజన చట్టంలోని అంశాలు అమలు చేయకుండా ఏపీకి భాజాపా తీరని అన్యాయం చేసిందని యనమల మండిపడ్డారు. వైసీపీ తన ఎంపీలతో రాజీనామా చేయించి లోక్సభ వేదికను కోల్పోయిందని.. అవిశ్వాసంపై ఓటింగ్లో పాల్గొనకుండా భాజాపాకి మేలు చేసిందని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ ఏపీ బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ బంద్ పై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వైసీపీ అనవసరంగా ఈ బంద్ చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ బంద్ కారణంగా రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోయాయని, పిల్లల చదువులకు ఇబ్బందులు కలుగుతోందని, వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. వైకాపా బంద్ పిలుపు వెనుక ఉద్దేశం.. రాష్ట్రంలో అశాంతి సృష్టించడమేనని యనమల ఆగ్రహం వ్యక్తంచేశారు.
విభజన చట్టంలోని అంశాలు అమలు చేయకుండా ఏపీకి భాజాపా తీరని అన్యాయం చేసిందని యనమల మండిపడ్డారు. వైసీపీ తన ఎంపీలతో రాజీనామా చేయించి లోక్సభ వేదికను కోల్పోయిందని.. అవిశ్వాసంపై ఓటింగ్లో పాల్గొనకుండా భాజాపాకి మేలు చేసిందని మండిపడ్డారు.
వైసీపీనే రాష్ట్రానికి చేయాల్సిన నష్టం అంతా చేసిందని.. ఇప్పుడు బంద్ ద్వారా మరింత నష్టం చేస్తోందని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే జగన్ బంద్ కి పిలుపునిచ్చారని ఆయన ఆరోపించారు.
పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి రాకుండా చేసి.. రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిని దెబ్బతీసేందుకే బంద్ పేరుతో నాటకాలు ఆడుతందన్నారు. వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే దిల్లీ వెళ్లి బంద్ చేయాలని ఛాలెంజ్ విసిరారు. దిల్లీ నుంచి పారిపోయి ఇక్కడ బంద్లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంపై పోరాటం ఢిల్లీలో చేయాలి గాని రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పట్టడం ఏమిటని మంత్రి నిలదీశారు.