పేదలకు ఇళ్ల పట్టాలపై వ్యాఖ్యలు.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు రోజా కౌంటర్
అమరావతిలో పేదలకు ఇచ్చే సెంటు స్థలాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధులతో పోల్చడంపై మండిపడ్డారు మంత్రి రోజా. ప్రజలు కూడా వాలంటీర్లను మెచ్చుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి రోజా. శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో రోజా పాల్గొని ప్రసంగించారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలాన్ని చంద్రబాబు సమాధులతో పోల్చడాన్ని ఆమె తప్పుబట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175కి 175 స్థానాల్లో గెలుస్తుందన్నారు. వరుసగా మూడోసారి వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా వుందని ఆమె పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థతో జగన్ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని రోజా ప్రశంసించారు. ప్రజలు కూడా వాలంటీర్లను మెచ్చుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రోజా ప్రశంసించారు.
అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లపై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి జోగి రమేశ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. పేదల ఇళ్లను సమాధులని సంబోధించడం దుర్మార్గమన్నారు. రాజధానిలో వుండటానికి పేదలు పనికిరారా.. వారు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పనికి వస్తారా అంటూ జోగి రమేశ్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జనం చంద్రబాబును, టీడీపీని రాజకీయంగా పాతరేస్తారని మంత్రి జోస్యం చెప్పారు. ఆర్ 5 జోన్లో ఇళ్ల పట్టాలకు సంబంధించిన సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్ట్ సైతం సమర్ధించిందని జోగి రమేశ్ గుర్తుచేశారు.
Also Read: జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేకే పొత్తులు.. మరి ఎవరు గెలిచినట్లు : చంద్రబాబు-జగన్లకు జోగి రమేశ్ చురకలు
ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా 30 లక్షల మంది అక్కాచెల్లెళ్లకు తాము ఇళ్లను కూడా నిర్మించి ఇస్తున్నామని జోగి రమేశ్ తెలిపారు. 17005 జగనన్న కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా వున్న సమయంలో ఒక్క సెంటు భూమిని కూడా పేదలకు ఇవ్వలేదని జోగి రమేశ్ దుయ్యబట్టారు. గతంలో మురికివాడల్లో ఎవరు జీవిస్తారని వ్యాఖ్యానించారని, ఎస్సీలలో ఎవరు పుట్టాలని అనుకుంటారని అన్నారని.. పేదలను చూస్తే చంద్రబాబుకు ఇంత అహంకారమా అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.