టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య పొత్తుపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ , చంద్రబాబులు కలవాలనుకుంటే తాము అడ్డుకోగలమా అని ఆమె అన్నారు.  

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని మరోసారి టార్గెట్ చేశారు మంత్రి ఆర్కే రోజా. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో పవన్‌పై నమ్మకం లేదని.. ఎమ్మెల్యేగా గెలవలేని ఆయన తనను ఓడిస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబులా తాము మేనిఫేస్టోని వెబ్‌సైట్ నుంచి తీసేయ్యలేదంటూ రోజా మండిపడ్డారు. పవన్ , చంద్రబాబులు కలవాలని అనుకుంటే అడ్డుకోగలమా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా ఎలాంటి పాలన అందించారో చూశామన్నారు. కానీ జగన్ మాత్రం అర్హత వున్న ప్రతి ఒక్కరికి నేరుగా పథకాలు అందజేస్తున్నారని రోజా ప్రశంసించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అంతకుముందు పేదలకు పక్కా ఇళ్ల పంపిణీకి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. వివరాల్లోకి వెళితే.. ఇవాళ నెల్లూరులో పర్యటిస్తున్న ఆయన మార్గమధ్యంలో అక్కడి టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం ఇళ్లతో సెల్ఫీ దిగారు. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. ‘‘చూడు .. జగన్ ఇవే టీడీపీ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది ఇళ్లు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు.. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని..? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ..? జవాబు చెప్పగలవా..?’’ అంటూ ఛాలెంజ్ విసిరారు. 

Also Read: టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు, సైకోతత్వం: జగన్ పై బాలకృష్ణ సంచలనం

అయితే దీనికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు నాయుడు సంగం బ్యారేజ్ వద్దకు వచ్చి చూడాలని సలహా ఇచ్చారు. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబేనని.. ఈ విషయాన్ని ఎన్టీఆరే స్వయంగా చెప్పారని మంత్రి చురకలంటించారు. శని కన్నా నువ్వు పెద్ద గ్రహనివని.. కరువు కాటకాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కరువే తాండవించిందని కాకాణి ఎద్దేవా చేశారు. 

వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.. అలాంటి వ్యవస్థపై విష ప్రచారం చేస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా నీ పక్కనే వుంటే.. 2019లో ఎందుకు ఓడిపోయావ్ అని ఆయన ప్రశ్నించారు. అన్ని సంతోష సూచికలు బాగుంటే నీ కొడుకు ఎందుకు ఓడిపోయాడంటూ మంత్రి వ్యాఖ్యానించారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత వాలంటీర్ వ్యవస్థది కాదా అని గోవర్ధన్ రెడ్డి నిలదీశారు.