చంద్రబాబు లక్ష్యమిదే... అందుకు పావుగా రఘురామ కృష్ణంరాజు: మంత్రి రంగనాథరాజు
- గతంలో వర్గీకరణ పేరిట అతి పెద్ద డ్రామా ఆడి దళితుల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టాడని... ఇప్పుడు రాజుల మధ్య చిచ్చు పెడుతున్నాడని మంత్రి రంగనాథరాజు ఆరోపించారు.
అమరావతి: రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడమే ప్రధాన అజెండాగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు మండిపడ్డారు. రెడ్లకు, రాజులకు మధ్య ఏదో గొడవ ఉన్నట్టు చూపించాలని చంద్రబాబు ఆరాట పడుతున్నాడని... ఇందుకోసం రఘురామ కృష్ణరాజును రాజకీయ పావుగా వాడుకుంటున్నాడని రంగనాథరాజు ఆరోపించారు.
తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ... గతంలో వర్గీకరణ పేరిట అతి పెద్ద డ్రామా ఆడి దళితుల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టాడని... ఇప్పుడు రాజుల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆరోపించారు. రెడ్లకు, కమ్మ వారికి మధ్య వైరం ఉండాలని కోరుకుంటున్నాడని... దానికి అనుగుణంగానే తనకు అనుకూలమైన కొన్ని టీవీ ఛానెళ్ళలో డిబేట్లు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. ఆయా వర్గాలవారితో ప్రెస్ మీట్లు పెట్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు.
''ఏ రెండు కులాల మధ్య సయోధ్య ఉండకూడదన్నది చంద్రబాబు సిద్ధాంతం. ఇటువంటి వ్యక్తిని ఇంకా రాజకీయాల్లో ఉండనీయటం తగునా..? ప్రజలు పదే పదే ఛీ కొట్టినా బాబు బుద్ధి మారడం లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటూ క్షత్రియాస్ అని చెప్పి ఊరూపేరూ లేకుండానే పత్రికలో ప్రకటన ఇవ్వడం జరిగింది. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులకు సంబంధించి, ఊరు, పేరు లేకుండానే క్షత్రియుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ ప్రకటనలో చెప్పడం జరిగింది. క్షత్రియులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. మా కమ్యూనిటీ కమ్యూనిస్ట్ పార్టీ మొదలు వైయస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వరకు అన్ని పార్టీల్లో ఉన్నారు. వారంతా వారి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తున్నారు'' అన్నారు.
''చంద్రబాబు ఏ కులాన్నీ వదలకుండా కుట్రలు పన్నుతున్నారు. వర్గీకరణ అంటూ ఎస్సీలను రెచ్చగొట్టారు. తర్వాత కాపుల్ని బీసీల్లో చేర్చుతామని కాపుల్ని రెచ్చగొట్టి కాపులకు-బీసీలకు మధ్య వివాదాలు సృష్టించారు. రఘురామ కృష్ణరాజును రెచ్చగొట్టి రెడ్లను తిట్టించాడు. రెడ్లకు, రాజులకు, అలాగే కమ్మవారికి, రెడ్లకు తగువులు పెట్టుకుంటూ వస్తున్నారు. చివరకు రాజుల కులాన్ని కూడా చంద్రబాబు వదలలేదు. మా మధ్య కూడా వివాదాలు, విభేదాలు సృష్టిస్తున్నారు. క్షత్రియులు ఎప్పుడూ కూడా గౌరవప్రదంగా అందర్ని కలుపుకుని పని చేసుకునిపోతుంటారు. దయచేసి మాలో మాకు గొడవలు పెట్టవద్దు. ఎక్కడో హైదరాబాద్లో ఉండి క్షత్రియుల గురించి మాట్లాడటం సరికాదు. ఏదైనా ఓపెన్గా ఉంటే మంచిది'' అని సూచించారు.
read more జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్... ఏపీకి అనుకూలంగా వంశధార ట్రిబ్యునల్ తీర్పు
''రాష్ట్రంలో ఒకవైపు పెద్ద ఎత్తున కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. మరోవైపు ప్రపంచాన్ని కుదిపివేస్తున్న కరోనాతో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ, కులాల మధ్య చిచ్చు పెట్టడం తగదు. మాలో మాకు విద్వేషాలు పెట్టి వివాదాలు సృష్టించవద్దని కోరుతున్నాం. మీరు గతంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కూడా పని చేశారు. ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నించవద్దు. ఏదైనా పత్రికా ప్రకటన ఇచ్చినప్పుడు వారి పేరు, వూరు, ఇచ్చిన సంస్థ పేరు లేకుండా ప్రకటన ఇస్తే అది ఎంతవరకు సమంజసం..? అలాగే బాధ్యతయుతమైన పత్రికలు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి'' అని హెచ్చరించారు.
''ఇవాళ క్షత్రియులంతా వైఎస్సార్ సీపీకి దగ్గరగా ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి మా క్షత్రియులకు మూడు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఇచ్చి... మంత్రి పదవి ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని కులాలను, వర్గాలను కలుపుకుని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏ ట్రస్ట్ అయినా చట్టాల పరిధిలోనే నడుస్తాయి. ప్రతి సంస్థలోనూ లోటుపాట్లు అనేవి ఉంటాయి. మాన్సాన్ ట్రస్ట్ గానీ, సింహాచలం దేవస్థానం ఆస్తులు గానీ,.. ఆ ట్రస్టులను ఛారిటిబుల్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో పాటూ రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తూ, వాటిలో లోటుపాట్లు ఉంటే ఆ లోపాలను సవరిస్తాయి'' అన్నారు.
''కోవిడ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. రాష్ట్రంలో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రూపాయి ఖర్చు లేకుండా కరోనా వైద్యంతో పాటు బ్లాక్ ఫంగస్ ను కూడా ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్యశ్రీలో చేర్చారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా కరోనా రోగులను గుర్తించి వారిని అంబులెన్స్ల ద్వారా ఆస్పత్రికి తరలించి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందిస్తోంది'' అన్నారు.
''రఘురామ కృష్ణంరాజుకు పనేముంది, ఆయన తన నియోజకవర్గానికి వచ్చి 15 నెలలు అవుతుంది. ఎప్పుడూ ఢిల్లీలో కూర్చోవడం.. తన పేరు రోజూ పత్రికల్లో, టీవీలో కనిపించాలనే ఉద్దేశంతో పనీపాటా లేకుండా ఏదో ఒక విషయాన్ని లేవనెత్తుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. తన నియోజకవర్గ ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన ఎంపీ రఘురామ తన నియోజకవర్గానికి రాకుండా హైదరాబాద్లోనో, ఢిల్లీలోనో కూర్చొని చట్టాలు, వ్యవస్థల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. అలాగే వ్యక్తిగతంగా కూడా నీచాతి నీచంగా మాట్లాడం సరికాదు. నేను కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. పార్లమెంట్ సభ్యుడిగా నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించి గౌరవం పొందాలని చెప్పాం'' అన్నారు మంత్రి రంగనాథరాజు.