డ్వాక్రా బజార్ లో మంత్రి పరిటాల సునీత షాపింగ్
ఈ స్టాల్స్ లో రాత్రికి రూ.20లక్షల బిజినెస్ జరిగిందని ఆమె తెలిపారు. ఇలాంటి బజార్ లలో ఏర్పాటు చేసిన వస్తువులను ప్రజలను కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు.
ఏపీ మంత్రి పరిటాల సునీత విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ లో షాపింగ్ చేశారు. చేనేత హస్తకళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో కొనుగోళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తన వంతుగా షాపింగ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
శుక్రవారం విజయవాడ నగరంలోని పిడబ్ల్యూడి గ్రౌండ్ లో అఖిల భారత డ్వాక్రా బజార్ -2018ను ఏర్పాటు చేశారు. దీనిని మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. అనంతరం ఆమె అందులో షాపింగ్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ డ్వాక్రా బజార్ లో 320 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ స్టాల్స్ లో రాత్రికి రూ.20లక్షల బిజినెస్ జరిగిందని ఆమె తెలిపారు. ఇలాంటి బజార్ లలో ఏర్పాటు చేసిన వస్తువులను ప్రజలను కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు. ప్రజలు, రాజకీయనాయకులు, అధికారులు వారి కుటుంబాలతో వచ్చి ఈ డ్వాక్రా బజార్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో వస్తువులు కొనుగోలు చేయాలన్నారు.
అప్పుడే ఇక్కడ ఏర్పాటు చేసిన డ్వాక్రా ఉత్పత్తులను ఆదరణ లభిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి డ్వాక్రా మహిళ రూ.10వేల ఆదాయం సంపాదించే విధంగా చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఈ బజార్ లో కాటన్ చీరలు, పచ్చళ్లు, ఫుడ్ ఐటమ్స్, రాయలసీమ రాగిసంకటి లాంటివి ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు.
మొదట ఈ డ్వాక్రా బజార్ ని అనంతపురంలో ఏర్పాటు చేయాలని భావించామని.. అయితే ఆశించిన బిజినెస్ జరగదని విజయవాడలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతేడాది అనంతపురంలో రూ.20కోట్ల బిజినెస్ జరిగిందన్నారు. ఈ ఏడాది విజయవాడలో మరింత ఎక్కువ జరిగే అవకాశం ఉందన్నారు.