ఆ మహిళల పసుపు-కుంకుమలు తుడిచేశారు..జగన్ పై సునీత ఫైర్
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి పరిటాల సునీత విమర్శల వర్షం కురిపించారు. జగన్ పాదయాత్రకే పరిమితమవుతారని..ఎప్పటికీ సీఎం కాలేడని మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
వైఎస్ హయాంలో ఎంతో మంది మహిళల పసుపు-కుంకుమలు తుడిచేశారని, తాము చంద్రన్న పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు సాయం చేస్తున్నామని తెలిపారు. రాయలసీమలో అభివృద్ధి జరగలేదని కన్నా దుష్ర్పచారం ప్రారంభించారని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలో రాయలసీమలో అభివృద్ధి జరిగిందా..? అని మంత్రి ప్రశ్నించారు. ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన హంద్రీనీవాను వైఎస్ ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇస్తున్నామని, ఇవాళ సీమ మొత్తం పంటలతో కళకళలాడుతోందని మంత్రి సునీత తెలిపారు.