ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కార్పోరేషన్ ద్వారా అందించే పలు పథకాాలకు అర్హులైనవారినుండి దరఖాస్తులను ఆహ్వానించారు మంత్రి మేరుగ నాగార్జున.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రైతులు, నిరుద్యోగులకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున గుడ్ న్యూస్ చెప్పారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా అందించే పలు పథకాలను పొందేందుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అమృత్ జలధార, యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మంత్రి నాగార్జున తెలిపారు. 

 చిన్న, సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ జలధార పథకాన్ని అమలుచేస్తుంది. ఎస్సీ రైతుల భూములకు నీటి వసతిని కల్పించేందుకు బ్యాంకులు లేదా ఇతర సంస్థల ద్వారా రుణాలు పొందిన రైతులకు బోర్లు వేసుకోడానికి, స్పింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడానికి రూ.50 వేలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని మంత్రి నాగార్జున తెలిపారు. రెండున్నర ఎకరాల భూమి, రూ.3 లక్షలకు లోపు వార్షిక ఆదాయం కలిగిన రైతులు ఈ పథకం ద్వారా రుణాలు, సబ్సిడి పొందేందుకు అర్హులని మంత్రి తెలిపారు. 

Read More టీడీపీ ఆవిర్భావం రోజే.. లోకేష్‌కు ఎమ్మెల్సీగా లాస్ట్ డే, ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ బాబూ : కొడాలి నాని చురకలు

ఇక యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకం నిరుద్యోగ యువతకు బాగా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లు, ట్రాలీలు, కమర్షియల్ వాహనాలు, వేర్ హౌసెస్ తదితర స్వయం ఉపాధి పథకాలకు ఇప్పటికే బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా రుణాలు పొందిన ఎస్సీ యువతకు రూ.60 వేలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్, కుల, విద్యా ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ పాసుపుస్తకాల నకళ్లతో దరఖాస్తులు చేసుకోవాలని నాగార్జున వివరించారు. ఈ పథకాల మంజూరు లో పరిమితి లేదని అర్హులైన వారందరికీ వీటిని అందించడం జరుగుతుందని మంత్రి నాగార్జున పేర్కొన్నారు.