దుబాయ్ ఎక్స్ పో 2020 పర్యటనలో భాగంగా మంత్రి మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల అధికారుల  బృందం సోమవారం మూడు కీలక ఎంవోయూలను కుదుర్చుకుంది. 

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం సుస్థిరత, సుపరిపాలన, పారదర్శక పారిశ్రామిక విధానాల (indistrial policy)తో పెట్టుబడిదారులకు సాదరంగా ఆహ్వానం పలుకుతోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (mekapati goutam reddy) పేర్కొన్నారు. కేవలం రాబోయే ఐదేళ్లకే కాదు 15 ఏళ్ళలో పెట్టుబడిదారులను ఆకర్షించే పాలసీ ఏపీదని... పారిశ్రామికవేత్తలు స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి గౌతమ్ రెడ్డి ఆహ్వానించారు.

దుబాయ్ ఎక్స్ పో 2020 (dubai expo 2020) పర్యటనలో భాగంగా మంత్రి మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల అధికారుల బృందం సోమవారం మూడు కీలక ఎంవోయూలను కుదుర్చుకుంది. రెండు జీ2బీ, ఒక బీ2బీ తరహా అవగాహన ఒప్పందాలు చేసుకుంది. లండన్ కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.3వేల కోట్ల విలువైన ఎంవోయూ చేసుకుంది. 

రీజెన్సీ గ్రూప్ కూడా రూ.150 కోట్ల విలువైన 25 రీటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు ముందుకొచ్చి ఎంవోయూ కుదుర్చుకుంది. రీటైల్ వ్యాపారంలో గ్రాంట్ హైపర్ మార్కెట్ బ్రాండ్ నేమ్ తో 25 సంవత్సరాలుగా సత్తా చాటుతున్న రీజెన్సీ గ్రూప్ తో జీ2బీ(గవర్నమెంట్ టు బిజినెస్) ఏపీ ఒప్పందం చేసుకుంది. ఈ గ్రూప్ అనంతపురం, కడప, కర్నూలు, మదనపల్లి, చిత్తూరు, నెల్లూరు, హిందూపురం ప్రాంతాలలో పంపిణీ కేంద్రాలు, స్పైసెస్ అండ్ పల్సెస్ ప్యాకేజీ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. 

Video

విశాఖలోని "ఫ్లూయెంట్ గ్రిడ్" అనే ఎస్సార్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ లో భాగమైన ట్రోయో జనరల్ ట్రేడింగ్ సంస్థతో బీ2బీ ఎంవోయూ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఏఐ అండ్ ఎంఎల్ టెక్నాలజీస్ పేరుతో విశాఖలో కొత్తగా 300 హైఎండ్ ఐ.టీ ఉద్యోగాలిచ్చే దిశగా ఒప్పందం కుదిరింది. ఎస్సార్ గురేర్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ బోర్డు సభ్యులు మాజీదల్ గురేర్ , ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థకు చెందిన సమయ్ మంగళగిరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. 

ప్రజా రవాణాకు సంబంధించిన డీజిల్ వాహనాలను తీర్చిదిద్దే పరిశ్రమను వైఎస్ ఆర్ కడప జిల్లా జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఏర్పాటు చేయడానికి మరో పరిశ్రమ ముందుకు వచ్చి ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఒప్పంద పత్రాలను మార్చుకున్న ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, కాజస్ కంపెనీ ఎండీ రవికుమార్ పంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం "దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో" జరిగింది. అన్ని రంగాల పెట్టుబడులకు అవకాశం గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి గౌతమ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సహజవనరులు, సకల సదుపాయాలు పుష్కలంగా కలిగిన ఏపీలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తూ "యూ గ్రో వి గ్రో" అన్న ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని మంత్రి మేకపాటి వినిపించారు.

 భారత్ , యూఏల మధ్య ఆత్మీయ వాణిజ్యపరంగా విడదీయలేని బంధం ఉందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. దేశ వృద్ధి రేటులో ఏపీ భాగస్వామ్యం కీలకమని మంత్రి స్పష్టం చేశారు. సీఎం జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రత్యామ్నాయం లేని రాష్ట్రంగా మారిందని మంత్రి తెలిపారు. కలిసి ఎదగడానికి, పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు ఏపీ స్వర్గధామమని మేకపాటి తెలిపారు. 

వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య రంగాలలో ఏపీకి తిరుగులేదని మంత్రి పేర్కొన్నారు. ఆక్వా రంగంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ అని మంత్రి స్పష్టం చేశారు. 16000 ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, 180 లార్జ్ , మెగా ఆహార శుద్ధి పరిశ్రమలున్న రాష్ట్రంగా 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయన్నారు. సహజవనరులు, తీరప్రాంతం, పారదర్శక పాలన, పెట్టుబడిదారులతో స్నేహపూర్వక సంబంధాలున్న ఏపీ సమగ్ర మౌలిక సదుపాయాలకు మరింత పెద్దపీట వేస్తుందన్నారు. 

పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ లు, రాష్ట్రం నలుమూలలకు వెళ్లేలా జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, కడప స్టీల్ ప్లాంట్, టెక్స్ టైల్ పార్కులు, మల్టీ లాజిస్టిక్ పార్కులు, త్వరలో కొలువుదీరనున్న పెట్రోలియం కాంప్లెక్స్ వంటి చౌక వాణిజ్యానికి గల అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి మేకపాటి పారిశ్రామికవేత్తలను కోరారు..