పోలవరం ప్రాజెక్టు ఓచరిత్ర: మంత్రి లోకేష్
పోలవరం ప్రాజెక్టు ఓ చరిత్ర అని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులు నిర్మించాలంటే తరాలు మారిపోవడం ఆనవాయితీగా మారిందని కానీ పోలవరాన్ని నాలుగేళ్లలో ఓ రూపునకు తీసుకువచ్చామని లోకేష్ స్పష్టం చేశారు. నిర్మాణం జాప్యంతో ప్రాజెక్టు ధరలు పెరుగుతాయన్న లోకేష్ కేంద్రం వేసే కొర్రిలన్నింటికి సమాధానం చెప్తున్నామన్నారు.
ఏలూరు: పోలవరం ప్రాజెక్టు ఓ చరిత్ర అని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులు నిర్మించాలంటే తరాలు మారిపోవడం ఆనవాయితీగా మారిందని కానీ పోలవరాన్ని నాలుగేళ్లలో ఓ రూపునకు తీసుకువచ్చామని లోకేష్ స్పష్టం చేశారు. నిర్మాణం జాప్యంతో ప్రాజెక్టు ధరలు పెరుగుతాయన్న లోకేష్ కేంద్రం వేసే కొర్రిలన్నింటికి సమాధానం చెప్తున్నామన్నారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు గ్యాలరీ వాక్లో పాల్గొనడం తన పూర్వజన్మసుకృతమని మంత్రి లోకేష్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబే శంకుస్థాపన చేసి, ఆయనే గ్యాలరీ వ్యాక్ చేయడం విశేషమన్నారు. నాగార్జున సాగర్కు నెహ్రూ శంకుస్థాపన చేస్తే.. ఇందిరాగాంధీ గ్యాలరీ వాక్ చేశారని గుర్తు చేశారు.
పోలవరం విషయంలో పునాది నుంచి గ్యాలరీ వాక్ చేసింది ఒక్క చంద్రబాబు నాయుడేనని కొనియాడారు. ఒక ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం దాదాపు 15 మంది కలెక్టర్లు మారతారని, అలాంటిది ఒకే కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు జరిగిందంటే, ఇదొక చరిత్ర అన్నారు.
భారత దేశంలో ఎక్కడ జరగని విధంగా సీఎం చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం జరుగుతుందని లోకేష్ పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
విభజన హామీలపై కేంద్రంతో పోరాడతామని తేల్చిచెప్పారు. కేంద్రం ఏపీకి సహకరించినా, సహకరించకపోయినా పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేసి తీరుతామనన్నారు.