Asianet News TeluguAsianet News Telugu

గుడివాడలో క్యాసినో, పేకాట రగడ.. నిరూపిస్తే, పెట్రోల్ పోసుకుని అంటించుకుంటా : కొడాలి నాని సవాల్

గుడివాడలోని (gudivada) తన కళ్యాణ మండపం రెండున్నర ఎకరాలు వుంటుందని.. దానిలో క్యాసినో, పేకాట వంటివి నిర్వహించినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మంత్రి కొడాలి నాని (kodali nani) సవాల్ విసిరారు. 

minister kodali nani challenge to tdp chief chandrababu naidu casino controversy in gudivada
Author
Gudivada, First Published Jan 21, 2022, 2:36 PM IST

గుడివాడలోని (gudivada) తన కళ్యాణ మండపం రెండున్నర ఎకరాలు వుంటుందని.. దానిలో క్యాసినో, పేకాట వంటివి నిర్వహించినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మంత్రి కొడాలి నాని (kodali nani) సవాల్ విసిరారు. గుడివాడలో టీడీపీ (tdp) నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల రాకను నిరసిస్తూ శుక్రవారం వైసీసీ (ysrcp) శ్రేణులు ఆందోళన నిర్వహించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు కొడాలి నాని. 

చంద్రబాబుకు (chandrababu naidu) టైం అయిపోయిందని.. ఎప్పుడూ గెలవని వర్ల రామయ్య, ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లందరితో నిజ నిర్థారణ కమిటీ వేశారంటూ ఆయన దుయ్యబట్టారు. ప్రశాంతంగా వున్న గుడివాడలో నిజ నిర్ధారణ కమిటీ పేరుతో గొడవలు పెడుతున్నారంటూ కొడాలి నాని ఆరోపించారు. సంక్రాంతికి రాష్ట్రంలో అన్ని చోట్లా జరిగినట్లే గుడివాడలోనూ జూదం జరిగిందని ఆయన అంగీకరించారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని తనకు సమాచారం రావడంతో తాను స్వయంగా డీఎస్పీకి ఫోన్ చేసి అడ్డుకున్నానని కొడాలి నాని తెలిపారు. 

తన కళ్యాణ మండపంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో లేదో చెప్పడానికి మీడియా, గుడివాడ ప్రజలు వున్నారని .. దీనికి టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేయాల్సిన అవసరం లేదన్నారు. మహిళలను  అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. నాడు లక్ష్మీపార్వతిని అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని.. నేడు భార్యను రోడ్డు మీదకు తీసుకొచ్చి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని కొడాలి నాని మండిపడ్డారు. 

కాగా.. ఈ క్యాసినో సెంటర్ నిర్వహణ విషయమై టీడీపీ నేతలు శుక్రవారం నాడు నిజ నిర్ధారణ చేయడానికి గుడివాడకు వచ్చారు. క్యాసినో  నిర్వహించిన కే కన్వెన్షన్ సెంటర్ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు మోహరించారు. టీడీపీ కార్యాలయం నుండి కె కన్వెన్షన్ సెంటర్ వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే  బొండా ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 

casino నిర్వహించిన కె కన్వెన్షన్ సెంటర్ వద్దకు టీడీపీ నేతలు వెళ్లకుండా అడ్డుకొన్నారు. రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి టీడీపీ నేతలు నిలువరించారు.అయితే ఈ సమయంలో టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ కార్యాలయం వెనుక నుండి వైసీపీ శ్రేణులు భారీగా వచ్చారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. వైసీపీ శ్రేణులు కుర్చీలు, రాళ్లతో దాడి వేశారు. వైసీపీ శ్రేణులను టీడీపీ శ్రేణులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు,. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయిటీడీపీ కార్యాలయం  వద్ద నుండి  వైసీపీ శ్రేణులను పంపించి వేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios