అప్పుడు ఎందుకు తలొగ్గారు..? చంద్రబాబుపై కొడాలి నాని విమర్శలు
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా విధానం ఉందని కొడాలి నాని అన్నారు. షిప్ యార్డ్, రైలు, విమాన సౌకర్యాలు ఉన్న వైజాగ్ను ముంబాయిలా త్వరలో చూడనున్నామని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. రాజధాని పేరిట రైతుల భూములను లాక్కునేందుకు చంద్రబాబు తన ప్రభుత్వంలో పగటి వేషగాడిలా సొల్లు మాటలు చెబుతున్నాడని కొడాలి నాని విమర్శించారు.
ప్రజలకు సాధ్యమైనంత వరకు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి రాజధానిని నిర్మించే విషయంలో దొంగల లాగా బాబు ప్రవర్తించారని పేర్కొన్నారు. 33వేల ఎకరాలను రైతుల నుంచి కొల్లగొట్టేందుకే మాయ మాటలు చెప్పారన్నారు.
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా విధానం ఉందని కొడాలి నాని అన్నారు. షిప్ యార్డ్, రైలు, విమాన సౌకర్యాలు ఉన్న వైజాగ్ను ముంబాయిలా త్వరలో చూడనున్నామని అభిప్రాయపడ్డారు. రాయలసీమలో కోర్టులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. జీఎన్ రావు, బోస్టెన్ కమిటీలు ఇచ్చిన నివేదికలను బోగీ మంటల్లో వేయమని బాబు వ్యాఖ్యానించటం తగదన్నారు.
ఆయన పాలనా విధానాలు నచ్చక రాష్ట్ర ప్రజలు బాబుకు బుద్ధి చెప్పిన మార్పు రాలేదని చెప్పారు. 74ఏళ్ల చరిత్ర కలిగిన బోస్టన్ కంపెనీ నివేదికను తప్పు బట్టే చంద్రబాబు ఎందుకు సింగపూర్ కంపెనీతో రూ.800కోట్లకు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. కరెన్సీ నోట్లు మారినపుడు ఆ కంపెనీ నివేదికకు బాబు ఎందుకు తలొగ్గారని అడిగారు.
ఇప్పటికైనా పిట్టల దొరలా రాజధాని రైతులకు దొంగ మాటలు చెప్పవద్దని హితవు పలికారు. రాజధాని రైతులు తమ కోర్కెలతో తమ ప్రభుత్వాన్ని కలిస్తే జగన్ మేలు చేకూరుస్తారని చెప్పారు. అంతేగాని బాబు మాటలు నమ్మి ఇంకా మోస పోవద్దన్నారు. టీడీపీకి చెందిన సుజనా చౌదరి బ్యాంకులను లూటీ చేయటంతో ఎక్కడ జైల్లో వేస్తారోనని బీజేపీలోకి వెళ్లాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు.